పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో ఒక ఇంటికి వచ్చిన పార్శిల్ స్థానికులను షాక్కు గురి చేసింది. సాగి తులసి అనే మహిళకు వచ్చిన ఈ పార్శిల్లో విద్యుత్ సామగ్రి ఉందని భావించగా, అందులో 45 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం సగభాగం ఉండటం స్థానికంగా కలకలం రేపింది.
సాగి తులసి గ్రామం ఇల్లు నిర్మించుకుంటోంది. దాదాపు పూర్తికావొచ్చిన ఆ ఇల్లు.. ప్లాస్టింగ్ స్టేజ్లో ఉంది. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం క్షత్రియ సేవా సమితికి ఆమె దరఖాస్తు చేసుకుంది. మొదటి విడతలో సేవా సమితి టైల్స్ అందజేసింది. మరోసారి ఆర్థిక సాయం కోసం మహిళ దరఖాస్తు చేసుకోగా.. పార్శిల్లో విద్యుత్ సామగ్రికి బదులు మృతదేహం వచ్చింది.
మృతదేహంతో పాటు హెచ్చరిక లేఖ
పార్శిల్లో మృతదేహంతో పాటు ఒక అనుమానాస్పద లేఖ కూడా లభించింది. లేఖలో “రూ. 1.30 కోట్లు చెల్లించాలి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది” అని హెచ్చరిక కూడా ఉంది. దీంతో షాక్కు గురైన మహిళ పోలీసులకు సమాచారం అందించింది. మహిళ నివాసానికి చేరుకున్న పోలీసులు పార్శిల్ను తనిఖీ చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇంటి నిర్మాణానికి సాయంగా క్షత్రియ సేవా సమితి తరఫున ఈ పార్శిల్ వచ్చిందని, విద్యుత్ సామగ్రికి బదులుగా శవం పంపించడంపై స్థానికులు, పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహం ఎవరిది? లేఖలో పేర్కొన్న సూత్రధారులు ఎవరు? అన్న కోణాల్లో విచారణ కొనసాగుతోంది.