కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో జరిగిన ఓ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వగ్రామమైన బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామంలో దళిత వృద్ధ మహిళపై అత్యాచారం జరగడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
స్థానికులు, బంధువుల సమాచారం ప్రకారం.. ఈ నెల 15వ తేదీ సాయంత్రం యనకండ్ల గ్రామానికి చెందిన లక్ష్మమ్మ (65) గడ్డి కోసం పొలానికి వెళ్లింది. అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త దాట్ల అమర్నాథ్ (24) వెనుక నుంచి వచ్చి ఆమెను గడ్డి మోపు కిందకు నెట్టేసి అత్యాచారం చేశాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మహిళ కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి అరవడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం.
ఈ ఘటన తర్వాత తీవ్ర మనోవేదనకు గురైన లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఈ నెల 22వ తేదీన ఆమె మృతి చెందింది. విషయం బయటకు రావడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నెల 24న మృతురాలి బంధువులు, దళిత సంఘాల నేతలు పోలీస్ స్టేషన్ను ముట్టడి చేసి ఆందోళనకు దిగారు.
నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, వెంటనే అరెస్ట్ చేసి విచారించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే మంత్రి స్వగ్రామం కావడంతో పోలీసులు కేవలం 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
యువకుడిని అరెస్ట్ చేసి లోతైన విచారణ చేపడితే అసలు నిజాలు బయటకు వస్తాయని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. దళిత వృద్ధ మహిళపై జరిగిన ఈ దారుణ ఘటనపై ప్రభుత్వం, పోలీసు శాఖ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రంలో మహిళల భద్రత, దళితుల రక్షణపై మరోసారి తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది.








