ముంబై (Mumbai) తీరంలో ఫెర్రీ బోల్తా పడి 13 మంది దుర్మరణం చెందారు. గేట్ వే ఆఫ్ ఇండియా (Gate Way Of India) నుంచి ఎలిఫెంటా కేవ్స్ (Elefenta Caves)కు ఫెర్రీ 110 మంది పర్యాటకులతో బయల్దేరింది. మార్గమధ్యలో ఓ స్పీడు బోటు అకస్మాత్తుగా దూసుకొచ్చి ఫెర్రీని ఢీకొట్టింది. క్షణాల్లోనే ఫెర్రీ బోల్తా పడి మునిగిపోయింది.
భయాందోళనకు గురైన ప్రయాణికులు ప్రాణభయంతో బెంబేలెత్తిపోయారు. వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. పోర్టు అధికారులు, కోస్ట్గార్డ్, మత్స్యకారుల సహాయంతో వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే స్పీడ్బోటు వేగంగా ఫెర్రీని ఢీకొట్టిన దృశ్యాలు సోషల్ మీడియలో వైరల్గా మారాయి.
సీఎం ఫడ్నవీస్ వివరణ..
బోటు ప్రమాదం బుధవారం మధ్యాహ్నం 4 గంటలకు జరిగిందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. 101 మందిని రెస్క్యూ టీమ్స్ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారని, 13 మంది మరణించారని ఆయన తెలిపారు. 13 మందిలో ముగ్గురు నేవీ సిబ్బందితో సహా 10 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. 11 క్రాఫ్ట్లు, నాలుగు హెలికాప్టర్లను ఉపయోగించి, నేవీ, కోస్ట్ గార్డ్, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారన్నారు. గల్లంతైన వారి సమాచారం ఉదయానికి తెలుస్తుందని చెప్పారు. మృతుల కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక్కొక్కరికి రూ.5 లక్షల నగదు సాయాన్ని సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు.