పిఠాపురం మున్సిపల్ కాంట్రాక్టర్ సూరవరపు (సత్తిరాజు) దివాణం తన ఆవేదన వ్యక్తం చేశారు. “పేదలకు అన్న క్యాంటీన్లు నిర్మించా, కానీ నాకే అన్నం లేకుండా చేస్తున్నారు” అంటూ కలెక్టర్తో పాటు అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని అంబేడ్కర్ భవన్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఈ ఘటన చోటుచేసుకుంది.
దివాణం మాట్లాడుతూ.. తన బిల్లుల చెల్లింపులు నిలిపివేస్తూ అధికారులు లంచం డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. రూ.40 లక్షల అప్పు తెచ్చి గోల్లప్రోలు, పిఠాపురం, ఏలేశ్వరం, తుని పట్టణాల్లో అన్న క్యాంటీన్లు నిర్మించానని, ఇప్పటి వరకు వడ్డీల మీద వడ్డీలు కట్టుకుంటూ నష్టపోతున్నానని చెప్పారు.
లంచం ఇవ్వలేదని బిల్లులు నిలిపివేశారు
దివాణం తనపై జరుగుతున్న అన్యాయాన్ని కలెక్టర్ ముందు ఉంచారు. “30% తక్కువ రేటుకే టెండర్ వేసి పనులు చేశా. అయినా లంచం ఇవ్వలేదని బిల్లులు ఆపేశారు. కౌన్సిల్ తీర్మానం చేయాలంటూ, అందుకు 5% కమీషన్ డిమాండ్ చేస్తున్నారు” అంటూ ఆయన తన బాధను వ్యక్తం చేశారు.
కేవలం క్యాంటీన్ల పనులే కాదు, కాలువల్లో పూడికలు తీయించిన బిల్లులు కూడా ఇంకా చెల్లింపుకాకపోయాయని చెప్పారు. ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఐదుసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని, చివరికి కలెక్టర్ సమాధానంగా “నీ దిక్కున్నవాడితో చెప్పుకో” అని వ్యాఖ్యానించారని ఆరోపించారు.
ఈ ప్రభుత్వానికి మించి గత ప్రభుత్వమే మంచిది
కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన దివాణం, గత ప్రభుత్వంలో పనులు చేసిన వెంటనే బిల్లులు చెల్లించేవారని, ప్రస్తుత ప్రభుత్వం లంచాల కోసం బిల్లులు నిలిపివేస్తూ ఏడిపిస్తోందని పేర్కొన్నారు. “పేదలకు అన్నం పెడతామన్న భావనతో భార్య పుస్తెలతాడు తాకట్టు పెట్టి క్యాంటీన్లు కట్టించాం. కానీ, ఇప్పుడు నాకు న్యాయం దక్కడం లేదు,” అన్నారు.
బిల్లులు చెల్లింపులు త్వరలో..
ఈ ఫిర్యాదులపై స్పందించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్, సంబంధిత అధికారులను దివాణంకు త్వరలో బిల్లులు చెల్లించాల్సిందిగా ఆదేశించారు. కానీ, ఈ ప్రక్రియలో ఎంతవరకు న్యాయంగా జరిగేది వేచి చూడాల్సిందే.