దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐబొమ్మ కేసు (iBomma Case) కీలక మలుపులు తిరుగుతోంది. ఐబొమ్మ పైరసీ కేసు దర్యాప్తు వేగం అందుకుంది. తాజాగా ఈ కేసులో నిందితుడు ఇమ్మడి రవి(Immadhi Ravi) ఎలా పోలీసులు వలలో చిక్కాడన్న వివరాలు బయటకు వచ్చాయి. ఇటీవల ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ (Hyderabad)కు వచ్చిన రవి, తన సన్నిహిత మిత్రుడికి పంపిన ఒక సాధారణ మెసేజ్… చివరికి అతని అరెస్ట్కు దారి తీసింది. “మామా… హైదరాబాద్ వచ్చా, కలుద్దాం.. తాగుదాం” అనే ఆ సందేశంతోనే పోలీసులు అతడి లొకేషన్ను ఖచ్చితంగా నిర్ధారించగలిగారు.
సైబర్ క్రైమ్ అధికారులు రవి కదలికలపై ఇప్పటికే నిశితంగా నిఘా పెట్టారు. అతను ‘ఈఆర్ ఇన్ఫోటెక్’ (ER Infotech) పేరుతో పలు డొమైన్లను కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఆ డొమైన్లకు అనుబంధంగా ఉన్న ఫోన్ నంబర్ను ట్రాక్ చేస్తూ, రవి విదేశాల్లో ఉంటూ అప్పుడప్పుడు హైదరాబాద్కు వచ్చి ఒక మిత్రుడితో కలిసి పార్టీ చేసుకునే విషయం తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో రవి హైదరాబాద్కి వస్తే సమాచారం ఇవ్వాలని ఆ స్నేహితుడికి పోలీసుల ద్వారా స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.
ఈ క్రమంలో రవి ఫ్రాన్స్ నుంచి నగరానికి వచ్చిన వెంటనే, తన మిత్రుడికి ఆపై మెసేజ్ పంపాడు. ఆ సందేశం పోలీసులు భావించిన అనుమానాలను నిజం చేసింది. వెంటనే ఆ సమాచారాన్ని ఆధారంగా తీసుకుని, సైబర్ క్రైమ్ అధికారులు రవి ఉన్న ప్రదేశాన్ని ట్రాక్ చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. పైరసీ నెట్వర్క్పై మరిన్ని వివరాలు వెలికితీసేందుకు విచారణ కొనసాగుతోంది.








