తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వ పాలనపై కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వ పాలనలో అర్బన్ నక్సలైట్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వామ్యం అయ్యారని ఆరోపించారు. ముఖ్యంగా, కాంగ్రెస్ హయాంలో నామినేటెడ్ పోస్టుల్లో అర్బన్ నక్సలైట్లు (Urban Naxalites) ఉన్నారని ఆయన విమర్శించారు. అధికారంలో ఉన్నా, లేకున్నా నక్సలిజాన్ని పూర్తిగా అణచివేయడమే బీజేపీ (BJP) ప్రభుత్వ లక్ష్యమని బండి సంజయ్ స్పష్టం చేశారు.
పౌరహక్కుల నాయకులే నక్సలిజం అంతమైందని అంగీకరించినప్పటికీ, ఇన్ని రోజులు అమాయక పిల్లలు, యువకులను రెచ్చగొట్టింది అర్బన్ నక్సలైట్లేనని ఆయన అన్నారు. ఈ అర్బన్ నక్సలైట్లపై కూడా కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.అంతేకాకుండా, నక్సలిజాన్ని ఎవరు ప్రోత్సహించినా వారు నేరస్తులే అవుతారని బండి సంజయ్ పేర్కొన్నారు. జంగల్లో ఉన్న నక్సలైట్లు అమాయక పిల్లలకు తుపాకులు ఇస్తున్నారని ఆరోపించిన ఆయన, మావోయిస్టులను అంతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు.
మావోయిస్టులకు మద్దతు ఇచ్చేవారిపై కూడా చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. నక్సలైట్లకు హితవు చెబుతూ, “జంగల్ వదిలి, తుపాకులు విడిచిపెట్టి బయటకి రండి” అని బండి సంజయ్ పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో తనను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినా తాను భయపడనని ఆయన తేల్చి చెప్పారు. కేంద్రమంత్రి చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.








