అనకాపల్లి జిల్లాలో జనసేన పార్టీ నేతల భారీ భూ వివాదం సంచలనం సృష్టిస్తోంది. 35 ఎకరాల విలువైన భూమిపై నెలకొన్న వివాదంలో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సన్నిహితుడు సురేష్ మరియు జనసేన యలమంచిల ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మధ్య పరోక్ష పోరు నడుస్తోంది. గత 20 ఏళ్లుగా బీఆర్ఎస్ నాయుడు, పైలా వెంకటస్వామి, రమణ బాబు మధ్య కొనసాగుతున్న ఈ భూవివాదంలోకి జనసేన ఎమ్మెల్యే ఎంటరవ్వడంతో ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది.
భూవివాదం పరిష్కారం పేరుతో ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఇద్దరు పక్షాలనూ రాజీకి పిలిపించినట్టు సమాచారం. అయితే, ఈ రాజీ చేయడం కోసం రూ.20 కోట్లు డిమాండ్ చేసి, బీఆర్ఎస్ నాయుడు, వెంకటస్వామి వద్ద ఎమ్మెల్యే రూ.50 లక్షలు అడ్వాన్స్గా తీసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తనకు ఇస్తానన్న డబ్బు కోసం జనసేన ఎమ్మెల్యే నుంచి ఒత్తిడి పెరగడంతో బాధితులు పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడైన సురేష్ ను ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారాన్ని సురేష్ నేరుగా పవన్ కళ్యాణ్కు చెప్పినట్లు సమాచారం.
ఇక మరో వాటాదారుడు రమణ బాబు, సురేష్, బీఆర్ఎస్ నాయుడు, వెంకటస్వామి కలిసి తన భూమిని కబ్జా చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తనకు చెందిన 11 ఎకరాల భూమికి పాస్ బుక్కులు రాకుండా సురేష్ అడ్డుకుంటున్నాడని రమణ బాబు ఆరోపిస్తున్నాడు. దీంతో భూ వివాదం మరింత సంచలనంగా మారింది.
ఇదిలా ఉండగా, ఇదే ఎమ్మెల్యే విజయ్ కుమార్ గతంలో రూ.4 లక్షలకు అంగనవాడీ పోస్టును అమ్ముకున్నారన్న ఆరోపణలతో దళిత యువతి సునీత రిలే నిరాహార దీక్ష చేసిన ఘటన గుర్తుచేస్తోంది. ఆ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, ఇప్పుడు మరోసారి భూ వివాదం రూపంలో జనసేన ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జనసేన పార్టీలో ఇలాంటి వివాదాలు వెల్లువెత్తడం పార్టీ ప్రతిష్టపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.








