కోల్కతా (Kolkata)లోని ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens) వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు తొలి రోజే కుప్పకూలింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ప్రోటిస్, భారత బౌలర్ల ధాటికి కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయింది. ముఖ్యంగా పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) (5/27) అద్భుత ప్రదర్శన ముందు దక్షిణాఫ్రికా బ్యాటర్లు నిలబడలేకపోయారు.
ఓపెనర్లు ఐడెన్ మార్క్రామ్ (31), రికెల్టన్ (23) కాస్త ఆరంభం ఇచ్చినప్పటికీ, బుమ్రా కఠినమైన బంతులకు ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయారు. కెప్టెన్ బవుమా కేవలం 3 పరుగులకే అవుట్ కావడం జట్టు పతనానికి దారితీసింది. మధ్యలో ముల్డర్ (24), టోనీ డి జోర్జి (24) స్వల్ప పోరాటం చేసినా, ఇతర బ్యాటర్లు వికెట్లు వరుసగా కోల్పోవడంతో స్కోరు 159 వద్దే పరిమితమైంది.
టీమిండియా (Team India) బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 14 ఓవర్లలో 5 మెయిడెన్లతో కేవలం 27 పరుగులకు 5 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఈడెన్ గార్డెన్స్ పిచ్ను తన నియంత్రణలోకి తీసుకున్న బుమ్రా, కీలక వికెట్లను పడగొట్టాడు. ఆయనకు తోడుగా మహమ్మద్ సిరాజ్ (2/47) రెండు కీలక వికెట్లు తీశాడు. స్పిన్ విభాగం నుంచి కుల్దీప్ యాదవ్ (2/36), అక్షర్ పటేల్ (1/21) కూడా తమ వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించారు. కేవలం 55 ఓవర్లలో దక్షిణాఫ్రికా ఆలౌట్ కావడంతో, మ్యాచ్ మొదటి రోజు పూర్తిగా భారత బౌలర్ల ఆధిపత్యాన్ని చాటింది.








