‘చేసుకున్నోడికి.. చేసుకున్నంత మహదేవా’ అనే నానుడి గుర్తుందా..? సామెతకు కరెక్ట్గా సరిపోయే సంఘటనే ఆంధ్రరాష్ట్రంలో జరిగింది. ఈ ఘటన అధికార తెలుగుదేశం పార్టీని వీడియో కాల్స్ అంటేనే భయపెట్టేలా చేస్తోంది. క్యాడర్ను కలవరపెడుతోంది. ఇటీవల తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఏఐ(AI) (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో వీడియోలు తయారు చేయించి, వైసీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియా ఖాతాల్లోంచి పోస్టులు పెడుతోంది. అదే ఏఐ సహాయంతో తెలుగుదేశం పార్టీ క్యాడర్ను బురిడీ కొట్టించారు కేటుగాళ్లు.
ఏం జరిగిందంటే..
ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఘరానా మోసం జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu), దేవినేని ఉమ (Devineni Uma) మొహాలను ఉపయోగించి నకిలీ వీడియో కాల్స్ చేసి, తెలంగాణ (Telangana) టీడీపీ నాయకులను బోల్తా కొట్టించారు కేటుగాళ్లు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన టీడీపీ నేతలకు దేవినేని ఉమ పీఏ పేరుతో ఒక వ్యక్తి ఫోన్ చేసి, “సార్ వీడియో కాల్ చేస్తారు” అని చెప్పాడు. కాసేపటికి దేవినేని ఉమలా కనిపించే ఏఐ వ్యక్తి వీడియో కాల్ చేసి, “పార్టీ కార్యకర్తల పిల్లల చదువుకు సహాయం చేయాలి” అంటూ మూడు ఫోన్ పే నంబర్లకు డబ్బు పంపాలని ఆదేశించాడు. దీంతో విశ్వసించిన నాయకులు మొత్తం రూ.35 వేలు పంపారు.
కొన్ని రోజులకు మళ్లీ అదే వ్యక్తి ఫోన్ చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తానని, కాసేపట్లో చంద్రబాబు వీడియో కాల్ చేస్తారని చెప్పాడు. చెప్పినట్టుగానే చంద్రబాబు మొహంతో పోలిన వ్యక్తి వీడియో కాల్ చేయడంతో, నిజమని నమ్మిన 18 మంది టీడీపీ నాయకులు విజయవాడకు వెళ్లారు. సాయంత్రం తిరిగి ఫోన్ చేసి, చంద్రబాబును కలిసేందుకు 8 మందికి మాత్రమే అనుమతి ఉందని, “బాబును కలవాలంటే ఒక్కొక్కరు రూ.10 వేలు చెల్లించాలి” అని చెప్పి మరోసారి డబ్బు దోచుకున్నారు. హోటల్ బిల్లు కూడా తామే చెల్లిస్తామని నమ్మించిన దుండగులు, చివరికి నాయకులను మోసం చేసి పరారయ్యారు.
హోటల్ సిబ్బంది బిల్లు అడగడంతో గొడవ చెలరేగి, పోలీసులు రంగంలోకి దిగారు. వివరాలు తెలిసిన పోలీసులు దేవినేని ఉమను సంప్రదించగా, తాను ఎవరికి ఫోన్ చేయలేదని చెప్పాడు. ఆ తర్వాతే మోసపోయామని గ్రహించిన తెలంగాణ టీడీపీ నాయకులు పరువుపోతోందని పోలీస్ కంప్లయింట్ చేయకుండా సైలెంట్గా వెనుదిరిగారు.








