యంగ్ హీరో తేజా సజ్జ ప్రధాన పాత్రలో, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ‘మిరాయ్’ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. మంచు మనోజ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రికార్డుల వేట మొదలుపెట్టింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందనతో వరల్డ్ వైడ్ వసూళ్లలో సినిమాకు మంచి బజ్ నెలకొంది.
మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ ప్రకారం, మూడు రోజుల్లోనే ‘మిరాయ్’ రూ.81.20 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. తొలి రోజు రూ.27.2 కోట్లు, రెండో రోజు రూ.28.4 కోట్లు, మూడో రోజు రూ.25.6 కోట్లు వసూలు చేసి మొత్తం మీద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ వేగం చూస్తుంటే రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
తేజా సజ్జ యాక్షన్, విజువల్స్, కార్తీక్ ఘట్టమనేని టేకింగ్, మంచు మనోజ్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి వారం పూర్తికాకముందే అద్భుత వసూళ్లతో దూసుకుపోతుండటం చిత్రబృందానికి ఉత్సాహాన్నిస్తోంది.