మూడు రోజుల పర్యటన నిమిత్తం తన సొంత నియోజకవర్గం పులివెందుల (Pulivendula)కు వెళ్లిన వైఎస్ జగన్ (YS.Jagan).. ఇవాళ నల్లపురెడ్డిపల్లె (Nallapureddipalle) గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ ఉప ఎన్నిక (ZPTC By Election)లో అధికార టీడీపీ(TDP) నాయకులు తమపై దౌర్జన్యం చేయడం వల్ల ఓటు హక్కు వినియోగించుకోలేకపోయిన గ్రామస్తులు తమ ఆవేదనను జగన్ ఎదుట వ్యక్తం చేశారు. ఎన్నికల రోజున అధికారపక్షం పోలీసులను ఉపయోగించి ప్రజలపై చేసిన అణచివేత, ఓటు వేయనివ్వని పరిస్థితులను వారు ఆయనకు వివరించారు.

ఈ సందర్భంగా గ్రామస్థులను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ.. “నల్లపురెడ్డిపల్లెలో ఎన్నికలు ఎదుర్కునే ధైర్యం టీడీపీకి లేక ఈ గ్రామంలో ప్రజలకు ఓట్లు వేసుకునే స్వేఛ్చ లేకుండా పోలీసులను వాడుకుని జులుం చేసి ఏ రకంగా అన్యాయం చేశారనేది ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్న ఈ పరిస్థితుల్లో చెరగని చిరునవ్వుతో నా కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ మీ జగన్ రుణపడి ఉంటాడు. మీ ఆప్యాయతలకు, ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు” అని వ్యాఖ్యానించారు.

“గతంలో నంద్యాల ఉప ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత టీడీపీ కొట్టుకుపోయింది. అదే నంద్యాలలో వైసీపీ అఖండ విజయంతో గెలిచింది. ఎప్పుడైనా అన్యాయం చేసినా, దౌర్జన్యం చేసినప్పుడు దేవుడు అన్నీ చూస్తాడు. తెలుగుదేశం పార్టీకి గట్టిగా బుద్ధి చెబుతాడు. ఈరోజు రాష్ట్రంలో రైతుల సమస్యలు పట్టించుకున్న దిక్కు లేదు. సూపర్సిక్స్(Super Six) హామీలంటూ మోసం చేస్తున్నారు. ఏ ఒక్క వర్గం సంతోషంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోయే పరిస్ధితి త్వరలోనే రాబోతుంది” అని వైఎస్ జగన్ వివరించారు.








