ప్రకృతి ఉగ్రరూపం దాల్చినప్పుడు ఎంతటి వినాశనం జరుగుతుందో మరోసారి నిరూపితమైంది. తాజాగా ఆఫ్రికన్ దేశం సూడాన్ (Sudan)లో జరిగిన ఘోర ఘటన అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. పశ్చిమ సూడాన్లోని మర్రా పర్వత ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఒక గ్రామాన్ని పూర్తిగా నేలమట్టం చేశాయి. ఈ ఘటనలో దాదాపు 1,000 మంది ప్రాణాలు కోల్పోయారు. గ్రామంలో కేవలం ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు.

గ్రామం ఇప్పుడు పూర్తిగా శవాల దిబ్బగా మారిందని సైన్యం ప్రకటించింది. సూడాన్ లిబరేషన్ మూవ్మెంట్/ఆర్మీ ఈ విషయాన్ని ధృవీకరించింది. అబ్దేల్వాహిద్ (Abdelwahid) మొహమ్మద్ (Mohammad) నూర్ (Nur) నేతృత్వంలోని సంఘం ప్రకారం.. చాలా రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే ఆగస్టు 31న ఈ కొండచరియలు విరిగిపోయాయని వెల్లడించింది. ఈ ప్రాంతం ప్రస్తుతం డార్ఫర్ (Darfur) ప్రాంతంలో ఉన్న సంఘం నియంత్రణలో ఉంది.
మృతదేహాలను వెలికి తీయడానికి అంతర్జాతీయ సహాయ సంస్థలు, ఐక్యరాజ్యసమితి తక్షణ సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. పురుషులు, మహిళలు, చిన్నారులు సహా మృతదేహాలు ఇంకా శిథిలాల కింద ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది.









