ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఉద్రిక్తత కలిగించే సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta)పై దాడి జరిగినట్లు భారతీయ జనతా పార్టీ (BJP) వర్గాలు ప్రకటించాయి. ఆమె అధికారిక నివాసంలో ‘జన్ సువాయ్’ (Jan Suvai) కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి రేఖా గుప్తాపై దాడి చేయడమే కాకుండా, ఆమెను దూషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాడి చేసిన వ్యక్తి ఆమెను కొట్టాడని కూడా వార్తలు వస్తున్నాయి.
ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇంకా బయటకు రాకపోయినా, పోలీసులు వెంటనే స్పందించి దర్యాప్తు ప్రారంభించారు. దాడి చేసిన వ్యక్తి 35 ఏళ్ల వాడని గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన ఢిల్లీలో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.








