సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు దేశ అత్యున్నత న్యాయస్థానం భారీ ఊరట కల్పించింది. సాక్షి టీవీ డిబేట్ కేసులో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు సంపూర్ణ బెయిల్ మంజూరు చేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్ను పర్మనెంట్ బెయిల్గా కన్ఫర్మ్ చేసింది. ఈ సందర్భంగా ఏపీ పోలీసులపై సుప్రీం కోర్టు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది.
తన టీవీ షోలో గెస్ట్లు చేసే పరువు నష్టం వ్యాఖ్యలను అనుమతించవద్దన్న గత మధ్యంతర ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. లైవ్ కార్యక్రమంలో అతిథులు చేసే వ్యాఖ్యలను ఎలా నియంత్రించగలమన్న కొమ్మినేని తరఫు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకుని కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
అరెస్టు విషయంపై కూడా సుప్రీంకోర్టు ఏపీ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ను తప్పనిసరిగా పాటించాలని ఏపీ పోలీసులకు ఆదేశించింది. ఏడు సంవత్సరాల కంటే తక్కువ శిక్ష ఉండే కేసుల్లో పోలీసులు ముందుగా 41ఏ నోటీసు ఇచ్చి ప్రాథమిక విచారణ జరపాలని స్పష్టం చేసింది.
ఎలాంటి విచారణ చేయకుండానే నేరుగా కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేసిన ఏపీ పోలీసుల తీరును కోర్టు తప్పుబట్టింది. కొమ్మినేని తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే, న్యాయవాది అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు. విచారణ పూర్తిచేసిన సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది.








