ఫైనల్లో కోనేరు హంపి: మహిళల ప్రపంచకప్‌ చెస్‌లో భారత్‌కు డబుల్ ధమాకా!

ఫైనల్లో కోనేరు హంపి: మహిళల ప్రపంచకప్‌ చెస్‌లో భారత్‌కు డబుల్ ధమాకా!

మహిళల ప్రపంచకప్‌ నాకౌట్ చెస్ టోర్నమెంట్‌ టైటిల్‌ తొలిసారి భారత్ ఖాతాలో చేరడం ఖరారైంది. బుధవారం భారత్‌కు చెందిన ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌ దివ్య దేశ్‌ముఖ్ ఫైనల్‌కు చేరుకోగా, గురువారం దివ్య సరసన భారత దిగ్గజం కోనేరు హంపి కూడా చేరింది. చైనా గ్రాండ్‌మాస్టర్ లె టింగ్జితో జరిగిన రెండో సెమీఫైనల్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హంపి టైబ్రేక్‌లో 4–2 పాయింట్‌లతో… ఓవరాల్‌గా 5–3 పాయింట్‌లతో విజయాన్ని అందుకుని ఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఈ గెలుపుతో హంపి వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి కూడా అర్హత సాధించింది. బుధవారం నిర్ణీత రెండు క్లాసికల్ గేమ్‌ల తర్వాత హంపి, లె టింగ్జి 1–1తో సమంగా ఉన్నారు. దాంతో విజేతను తేల్చేందుకు గురువారం టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించారు. ముందుగా ర్యాపిడ్ ఫార్మాట్‌లో రెండు గేమ్‌లు జరిగాయి. అయితే ఈ రెండూ ‘డ్రా’గా ముగిశాయి. దాంతో ఇద్దరూ 2–2తో సమంగా నిలిచారు. అనంతరం ర్యాపిడ్ ఫార్మాట్‌లో మరో రెండు గేమ్‌లు నిర్వహించారు.

తొలి గేమ్‌లో లె టింగ్జి 65 ఎత్తుల్లో నెగ్గగా, రెండో గేమ్‌లో హంపి 39 ఎత్తుల్లో గెలిచింది. దాంతో స్కోరు 3–3తో సమమైంది. ఈసారి వీరిద్దరి మధ్య బ్లిట్జ్ ఫార్మాట్‌లో రెండు గేమ్‌లు నిర్వహించారు. ఈ రెండు గేముల్లోనూ హంపి నెగ్గి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. తొలి గేమ్‌లో హంపి 70 ఎత్తుల్లో, రెండో గేమ్‌లో 33 ఎత్తుల్లో గెలుపొందింది.

హంపి, దివ్య దేశ్‌ముఖ్ మధ్య ఈనెల 26, 27వ తేదీల్లో ఫైనల్ జరుగుతుంది. రెండు గేమ్‌లలో ఫలితం తేలకపోతే 28న టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు.

హంపికి ఇది రెండోసారి
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో టైటిల్ పోరుకు చేరడం హంపికి ఇది రెండోసారి. 2011లో మ్యాచ్ ఫార్మాట్‌లో నిర్వహించిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో హంపి ఫైనల్ చేరి చైనా గ్రాండ్‌మాస్టర్ హు ఇఫాన్‌ చేతిలో ఓడిపోయింది.

Join WhatsApp

Join Now

Leave a Comment