రాజకీయ నాయకులు స్థాయిని మరచి మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారని, ఇలాంటి దిగజారుడు రాజకీయాలు (Cheap Politics) రాష్ట్రంలో గతంలో ఎన్నడూ చూడలేదని సీపీఐ (CPI) రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో రాజకీయ నాయకుల వ్యవహారశైలిపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా (RK Roja)పై నగరి టీడీపీ ఎమ్మెల్యే (Nagari TDP MLA) గాలి భాను ప్రకాష్ (Gali Bhanu Prakash) చేసిన అనుచిత వ్యాఖ్యలను రామకృష్ణ ఖండించారు. పోలీసు వ్యవస్థ రాజకీయ ఒత్తిడులకు లొంగిపోయి, చట్టాన్ని పక్కనపెట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
“రాజకీయ నాయకులు హుందాగా విమర్శించుకోవాలి. మహిళలను కించపరిచేలా, దిగజారి మాట్లాడటం సమాజానికి ఏం సందేశం ఇస్తుంది?” అని రామకృష్ణ ప్రశ్నించారు. రోజాపై చేసిన వ్యాఖ్యలు కేవలం ఆమెను మాత్రమే కాదు, మహిళల గౌరవాన్ని (Women’s Dignity) దెబ్బతీశాయని, ఇలాంటి వ్యాఖ్యలను సమర్థించడం సమాజానికి సిగ్గుచేటని ఆయన అన్నారు. “రాజకీయ నాయకులు సమాజానికి ఆదర్శంగా ఉండాలి. ఇలాంటి దిగజారుడు మాటలు ప్రజలు ఏం నేర్చుకోవాలి?” అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్ అధికారులు సస్పెన్షన్కు గురైన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవు అని రామకృష్ణ ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్థ లంచకొండిగా మారి, అప్రతిష్టపాలైందని, ఇది రాష్ట్రానికి సిగ్గుచేటని ఆయన అన్నారు. “పోలీసులు తమ విధులను నిష్పక్షపాతంగా నిర్వర్తించాలి. రాజకీయ నాయకుల వంత పాడడం సరికాదు” అని రామకృష్ణ అన్నారు.
మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)ను ఉద్దేశించి సీపీఐ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. “రెడ్ బుక్ (Red Book)ను పక్కనపెట్టి, కక్ష సాధింపు రాజకీయాలను మానుకోండి” అని సూచించారు. రాష్ట్రంలో గతిలేని రాజకీయాలు నడుస్తున్నాయి. టీడీపీ లౌకిక పార్టీ అయినప్పటికీ, బీజేపీ(BJP)కి వంత పాడుతూ, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తోంది అని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలని, రాజకీయ ఒత్తిడులకు లొంగకుండా న్యాయం చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.








