తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో తమ పార్టీ నేతలపై అవాస్తవ ప్రచారం చేస్తున్న వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అసత్య ప్రచారం, దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కేటీఆర్ ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.
కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అగ్రనేతల అరెస్టులు కూడా జరగొచ్చని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ పై కొంతమంది బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేస్తూ, టాలీవుడ్ హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసి, వారిని లోబర్చుకోవాలని ప్రయత్నించారంటూ తీవ్రమైన ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ అలాంటి వాటిపై ఘాటుగా స్పందించారు.
“మీడియా ముసుగులో దుష్ప్రచారం”
కేటీఆర్ మాట్లాడుతూ, “కొంతమంది వ్యక్తులు మీడియా ముసుగులో కావాలనే ఇలాంటి నీచమైన దుష్ప్రచారం చేస్తున్నారు. కావాలని కొన్ని మీడియా సంస్థలు, కొంతమందితో జట్టు కట్టి, ఒక ముఠాగా మారి చేస్తున్న దుష్ప్రచారంపై చట్టపరంగా తగిన సమాధానం చెబుతాం. గత కొన్ని నెలలుగా కొంతమంది విలేకరుల వేషం వేసుకున్న కొంతమంది మీడియా సంస్థల యజమానులు నా పైన వ్యక్తిగతంగా, మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై విషం చిమ్ముతున్నారు” అని ఆరోపించారు.
కుటుంబంపై ప్రభావం, చట్టపరమైన పోరాటం
“అలాంటి వ్యక్తులు వ్యక్తపరుస్తున్న నీచమైన అభిప్రాయాలు నాపైన వ్యక్తిగతంగా ఎలాంటి ప్రభావం చూపించవు. కానీ పదేపదే వీరు చేస్తున్న వ్యక్తిత్వ హననం వలన మా కుటుంబ సభ్యుల పైన తీవ్రమైన దుష్ప్రభావం చూపిస్తున్నాయి. మీడియా రూపంలో వీరు చేస్తున్న దాడులు నా శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులను, పార్టీ శ్రేణులను బాధ కలిగిస్తున్నాయి. వారి ఒక్కొక్కరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాను. కలిసికట్టుగా వెనుక ఉండి నడిపిస్తున్న వారితోపాటు, దుర్మార్గపూరితంగా ఇలాంటి నీచమైన ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కరికీ తగిన రీతిలో చట్టపరంగా ఎదుర్కొంటాం” అని కేటీఆర్ స్పష్టం చేశారు.