మ‌ళ్లీ తెర‌పైకి కృష్ణజింక కేసు.. చిక్కుల్లో బాలీవుడ్ తారలు

మ‌ళ్లీ తెర‌పైకి కృష్ణజింక కేసు.. చిక్కుల్లో బాలీవుడ్ తారలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కృష్ణజింక వేట కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. 1998లో జోధ్‌పూర్‌లోని కంకాణీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో బాలీవుడ్ ప్రముఖులైన సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలీ బింద్రే, స్థానికుడు దుష్యంత్ సింగ్‌లపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసు మళ్లీ రాజస్థాన్ హైకోర్టులో తాజా పరిణామాలతో వెలుగులోకి వచ్చింది.

కేసు నేపథ్యం
1998 అక్టోబర్ 1-2 తేదీల్లో జోధ్‌పూర్‌లో ‘హమ్ సాత్ సాత్ హైం’ సినిమా షూటింగ్ సందర్భంగా సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలీ బింద్రే, దుష్యంత్ సింగ్‌లు కంకాణీ గ్రామంలో రెండు కృష్ణజింకలను వేటాడినట్లు ఆరోపణలు రాగా, ఈ ఘటన వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద నమోదైంది. 2018 ఏప్రిల్ 5న జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు సల్మాన్ ఖాన్‌ను దోషిగా తేల్చి, ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించింది. అయితే, సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలీ బింద్రే, దుష్యంత్ సింగ్‌లను సాక్ష్యాధారాల లేమి కారణంగా నిర్దోషులుగా ప్రకటించింది. సల్మాన్ ఖాన్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ రాజస్థాన్ హైకోర్టులో పిటీష‌న్ దాఖలు చేయగా, రాజస్థాన్ ప్రభుత్వం కూడా మిగిలిన నిందితులను నిర్దోషిత్వ తీర్పును సవాలు చేస్తూ ‘లీవ్ టు అప్పీల్’ దాఖలు చేసింది.

రాజస్థాన్ హైకోర్టు విచారణ
మే 16న (శుక్ర‌వారం) జస్టిస్ మనోజ్ కుమార్ గార్గ్ నేతృత్వంలోని రాజస్థాన్ హైకోర్టు బెంచ్ ఈ కేసులో ‘లీవ్ టు అప్పీల్’పై విచారణ జరిపింది. రాజస్థాన్ ప్రభుత్వం సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలీ బింద్రే, దుష్యంత్ సింగ్‌ల నిర్దోషిత్వ తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీల్‌తో పాటు, సల్మాన్ ఖాన్ దాఖలు చేసిన అప్పీల్‌ను కూడా ఒకేసారి విచారించాలని కోర్టు నిర్ణయించింది. ఈ రెండు అప్పీల్‌లను జూలై 28 తేదీన విచారించ‌నున్న‌ట్లు తెలిపింది.

సోషల్ మీడియాలో స్పందనలు
ఈ కేసు మళ్లీ తెరపైకి రావడంతో సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. కొందరు ఈ కేసును వన్యప్రాణి సంరక్షణకు సంబంధించిన ముఖ్యమైన పోరాటంగా భావిస్తుండగా, మరికొందరు దీనిని సెలబ్రిటీలను అనవసరంగా వేధిస్తున్నార‌ని ఎక్స్‌లో ఈ కేసు గురించి పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలీ బింద్రే, నీలం వంటి నటులపై మళ్లీ చర్చలు జోరందుకున్నాయి.

కృష్ణజింక వేట కేసు దాదాపు రెండు దశాబ్దాలుగా భారత న్యాయవ్యవస్థలో చర్చనీయాంశంగా ఉంది. రాజస్థాన్ హైకోర్టులో జులై 28, 2025న జరిగే తదుపరి విచారణ ఈ కేసులో కీలక మలుపును తీసుకొచ్చే అవకాశం ఉంది. సల్మాన్ ఖాన్ శిక్ష అప్పీల్, మిగిలిన నిందితుల నిర్దోషిత్వంపై ప్రభుత్వ సవాలు కలిసి విచారణకు రానున్న నేపథ్యంలో, ఈ కేసు మరోసారి దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment