ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యే తమ్ముడి అరెస్ట్ సంచలనం రేపుతోంది. కర్నూల్ జిల్లా కాంగ్రెస్ నేత చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణ హస్తం ఉందని భావించిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే తమ్ముడు గుమ్మనూరు నారాయణను ఆలూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. మంగళవారం జిల్లా కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా, ఆయన్ను కర్నూలు జైలుకు తరలించారు.
వివరాల్లోకి వెళితే.. ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్గా ఉన్న చిప్పగిరి లక్ష్మీ నారాయణను గుంతకల్లు పట్టణ శివారులో గత నెల 27న టిప్పర్ లారీతో గుద్ది ఆపై వేటకొడవళ్లు, ఆయుధాలతో తీవ్రంగా దాడి చేసి హత్య చేశారు. ఈ దాడిలో లక్ష్మీనారాయణ కుమారుడు వినోద్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయితే.. కాంగ్రెస్ నేత హత్య కేసులో ఎమ్మెల్యే తమ్ముడు నారాయణ ప్రధాన పాత్ర పోషించాడన్న అనుమానాలు తలెత్తాయి.
దీంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. కాంగ్రెస్ నాయకుడిని హత్య చేసిన వారికి ఎమ్మెల్యే తమ్ముడు నారాయణ ఆర్థిక సాయం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. వెంటనే గుమ్మనూరు నారాయణను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు. గత నెలలో గుంతకల్లులో జరిగిన కాంగ్రెస్ లీడర్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎమ్మెల్యే తమ్ముడు గుమ్మనూరు నారాయణ అరెస్ట్తో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది.