విద్యార్థిని కలను ప్రాణాంతక వ్యాధి కూడా ఆపలేకపోయింది.. ఏకంగా 99.17% మార్కులతో ఆ విద్యార్థిని స్టేట్ టాపర్గా నిలిచింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాకు చెందిన పదవ తరగతి విద్యార్థినీ ఇషికా బాలా అసాధారణ పట్టుదలతో రాష్ట్రస్థాయిలో తన ప్రతిభను కనబరిచింది. ప్రాణాంతకమైన బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూనే, చదువులో మాత్రం ఆమె వెనక్కి తగ్గలేదు. ఇటీవల విడుదలైన ఛత్తీస్గఢ్ సెకండరీ బోర్డు ఫలితాల్లో 99.17 శాతం మార్కులతో రాష్ట్రంలో మొదటి స్థానం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఒక సంవత్సరం పాటు వ్యాధి కారణంగా చదువుకు దూరమైన ఇషికా, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో మళ్లీ పాఠశాలకు హాజరయ్యింది. ఐఏఎస్ కావాలన్నది ఆమె జీవిత లక్ష్యం. చదువు విషయంలో ఆమె చూపిన కృషి ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది.
ఇషికా సామాన్య రైతు కుటుంబానికి చెందినది. ఆమె తండ్రి శంకర్ ఇప్పటికే ఆమె చికిత్స కోసం రూ.15 లక్షల వరకు ఖర్చు చేశారు. ఇషికా కుటుంబం ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉంది. ప్రభుత్వం సహాయం అందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, జిల్లాలోని విద్యాశాఖాధికారి అశోక్ కుమార్ పటేల్ మాట్లాడుతూ.. ఇషికాకు ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రధాని స్వస్థ్య సహాయత యోజన కింద అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇషికాకు అవసరమైన వైద్య సాయం అందించి, ఆమె ఆశయాలు సాకారం అయ్యేలా ప్రభుత్వం యత్నిస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.







