మద్యం మత్తులో ఓ భర్త తన భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన గ్రామాన్ని రంగారెడ్డి జిల్లా ఫరుక్నగర్ మండలం అయ్యవారిపల్లిలో తీవ్ర కలకలానికి గురి చేసింది. మద్యం కోసం ప్రతిరోజూ భార్యను వేధించే భర్త, డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో అతి దారుణంగా ఆమెను హత్య చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం, అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల పరుశురాములు కుటుంబ బాధ్యతలను పూర్తిగా విస్మరించి, రోజంతా పనికి వెళ్ళకుండా జులాయిగా తిరిగేవాడు. అతనికి మద్యం వ్యసనంగా మారింది. భార్య జానమ్మను నిత్యం డబ్బుల కోసం వేధించేవాడు. అయితే, ఆమె డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో రాత్రి ఆగ్రహంతో గొడ్డలితో దాడి చేసి ప్రాణాలు తీశాడు.
ఈ సంఘటన గ్రామస్థులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భార్యను హత్య చేసిన పరుశురాములను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.