భారతదేశంలో మొట్టమొదటిసారిగా ట్రంప్ బ్రాండెడ్ కమర్షియల్ ప్రాజెక్ట్ ‘ట్రంప్ వరల్డ్ సెంటర్’ నిర్మాణం పూణే నగరంలో ప్రారంభమైంది. ట్రంప్ ఆర్గనైజేషన్కు చెందిన ప్రాపర్టీ డెవలప్మెంట్ పార్ట్నర్ ట్రిబెకా డెవలపర్స్ ఈ ప్రాజెక్టును బుధవారం అధికారికంగా ప్రకటించింది. సుమారు 289 మిలియన్ల డాలర్ల అమ్మకాలను లక్ష్యంగా చేసుకుని దీన్ని ప్రారంభించారు.
గత దశాబ్ధంలో అమెరికా వెలుపల భారతదేశం ట్రంప్ బ్రాండ్కు అతిపెద్ద రియల్ ఎస్టేట్ మార్కెట్గా మారింది. ఇప్పటికే ట్రిబెకా డెవలపర్స్ దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ట్రంప్ లైసెన్స్డ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు చేపట్టింది. ఇప్పుడు పూణేలోని కుందన్ స్పేసెస్ సహకారంతో ఈ భారీ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు.
ట్రిబెకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా, ఈ ప్రాజెక్టును నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అంతేకాదు, రాబోయే 4-6 వారాల్లో ఉత్తర, దక్షిణ భారతదేశాల్లో ట్రంప్ బ్రాండెడ్ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. బుధవారం ప్రారంభించిన ‘ట్రంప్ వరల్డ్ సెంటర్’ ప్రాజెక్ట్తో పాటు, రాబోయే రెసిడెన్షియల్ ప్రాజెక్టుల మొత్తం అమ్మకాల విలువ 1.15 బిలియన్ల డాలర్లకు చేరుకోనుందని అంచనా. ఈ భారీ పెట్టుబడులు భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్పై ఏమేరకు ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.







