అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో కూర్చున్నా వైసీపీ ఎప్పుడూ ప్రజలతోనే ఉంటుందని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి పోరాడుతున్న పార్టీ వైసీపీ అని, ప్రజల అభివృద్ధే తమ లక్ష్యమని తెలిపారు. “ప్రజా సమస్యలపై మడమ తిప్పకుండా పోరాటం చేస్తున్నాం. ప్రజలు మనపై నమ్మకం ఉంచారు. మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రతిపక్షంలోనూ ప్రజల వెంటే
ప్రతిపక్షంలో కూర్చోవడం కొత్తమీ కాదని, అధికార పార్టీ తప్పులను ఎండగడుతూ, ప్రజా సమస్యలకు పరిష్కారాలు కోరుతూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. 3-4 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి రానున్నామని ఆయన పేర్కొన్నారు. పార్టీ నాయకత్వం చేపట్టిన విద్యా ఫీజుల పోరాటం, ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రస్తావిస్తూ, ప్రజలకు నిత్యం అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు జగన్ శుభాకాంక్షలు తెలిపారు.