టీడీపీ ఆఫీస్ దాడిపై అభియోగాల నేపథ్యంలో నమోదైన కేసులో విజయవాడ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం పరామర్శించారు. జగన్ పర్యటన సందర్భంగా విజయవాడలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అయినా జనం భారీగా తరలివచ్చారు. క్రౌండ్ను కంట్రోల్ చేయలేక పోలీసులు ఒక దశలో చేతులెత్తేశారు.
40 ఏళ్ల రికార్డు బ్రేక్
జగన్ను చూసేందుకు విజయవాడ జనం విపరీతంగా తరలిరావడంపై సీనియర్ జర్నలిస్ట్ విజయ్బాబు పాత తరం రోజులను గుర్తుచేసుకున్నారు. 80వ దశకంలో విజయవాడ జైలు వద్ద జరిగిన సంఘటనను మళ్లీ ఈ తరం ముందుకు తెచ్చారు. 40 ఏళ్ల క్రితం కాపు నాయకుడు వంగవీటి రంగా విజయవాడ జైలు నుంచి బయటకు వస్తున్నప్పుడు వీధులన్నీ ఇలాగే నిండిపోయాని, జయజయధ్వానాలతో రంగాకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని చెప్పారు. మళ్లీ అలాంటి సంఘటన 40 ఏళ్ల తరువాత వంశీని పరామర్శించి జగన్ బయటకు వస్తున్నప్పుడు కనిపించిందన్నారు. ఈ 40 ఏళ్లలో ఏ ఒక్క నాయకుడు జగన్లా కనిపించలేదన్నారు.
కమ్మ సామాజిక వర్గం నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్, బ్రహ్మనాయుడు, శంకర్రావులను ఈ ప్రభుత్వం ఎలా ఇబ్బంది పెట్టిందో వైఎస్ జగన్ వివరించారు. జగన్ ప్రతి కదలికలో కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ తలశిల రఘురాం దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇలా చంద్రబాబు వద్ద రెడ్డి సామాజిక వర్గం వాళ్లు ఎవరైనా ఉన్నారా? అని విజయ్బాబు ప్రశ్నించారు.