రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, మనం రాక్షస యుగంలో ఉన్నామని, చంద్రబాబు (Chandrababu) పాలనలో రాజకీయాల (Politics) నైతికంగా (Morally) పతనం (Collapsed) అయ్యాయని వైసీపీ (YSRCP) అధినేత, మాజీ సీఎం (Former CM) వైఎస్ జగన్ (YS Jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులు (Officials), పోలీసులకు(Police) సీరియస్ వార్నింగ్ (Warning) ఇచ్చారు . చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్నాడని జగన్ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీస్లో రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మున్సిపాలిటీ, రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు పరిపాలనలో యథేచ్ఛగా కేసులు, అరెస్టుల పర్వం కొనసాగుతోందని, అయితే వాటికి భయపడాల్సిన అవసరం లేదని.. అలాంటి వారే ఇప్పుడు రాజకీయాలు చేయగలరని, రాజకీయాల్లో మనుగడ కొనసాగించగలరని ఆయన తెలిపారు. మనం రాక్షస యుగంలో ఉన్నాం. కలియుగంలో అంటే చంద్రబాబు యుగంలో రాజకీయాలు చేయాలంటే.. కేసులు వేసినా భయపడొద్దని, జైళ్లకు పంపినా, చంద్రబాబు నిన్ను ఎదుర్కొంటాం అని గట్టిగా అంటేనే, అలా ఉండగలిగినప్పుడే రాజకీయాల్లో ఉండగలమన్నారు.
99 శాతం ఎన్నికల హామీలు అమలు చేసి ప్రజలకు మంచి చేసిన వైసీపీ ప్రతిపక్షంలో కూర్చుందంటే.. అదే చంద్రబాబు పరిస్థితి ఏమిటి? ఎన్నికలు ఎప్పుడొచ్చినా, ప్రజలు ఫుట్బాల్ను తన్నినట్లు తన్నుతారని వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరోజు కులం, మతం, రాజకీయం చూడకుండా వైసీపీ పరిపాలన సాగిందని, అదే ఈరోజు పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. అయినా ఎవరూ మాట్లాడలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని, ఇలాంటి పరిస్థితిలో రాజకీయం చేస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయని, తిరువూరులో సంఖ్యాబలం లేని చోటకూడా టీడీపీ పోటీకి ప్రయత్నం చేస్తోందన్నారు. సీఎంగా ఉన్న వ్యక్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడకపోవడం, పోలీసులను పెట్టి భయపెట్టడం ఏమిటి? అని జగన్ ప్రశ్నించారు. దౌర్జన్యం చేసి, కోరం లేదని చెప్పి, ఎన్నిక గెల్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
”ప్రతి కార్యకర్తకు చెబుతున్నా.. మీకు ఎవరు అన్యాయం చేసినా, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా, వారి పేరు రాసుకోండి. అది ఏ బుక్ అయినా సరే. వారి పేరు మాత్రం కచ్చితంగా రాసి పెట్టుకోండి. ఆ తర్వాత మనం వచ్చాక, ఈరోజు మీకు అన్యాయం చేసిన వారికి సినిమా చూపిస్తాం. ఆ మనిషి రిటైర్ అయినా, దేశం వదిలి పోయినా లాక్కొస్తాం. ఎవ్వరినీ వదిలి పెట్టం. సినిమా ఎలా చూపాలో వారికి చూపిస్తాం. మిమ్మల్ని ఎవరైనా కొట్టినా కొట్టించుకోండి. ఫరవాలేదు. నీ టైమ్ బాగుంది. కొట్టు అనండి. ఆ తర్వాత మన టైమ్ వస్తుంది. అప్పుడు మనం కొడతాం. ఇవాళ వారు నాటుతున్న విత్తనం రేపు రెండింతలు అవుతుంది” అని మాజీ సీఎం వైఎస్ జగన్ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.