వైసీపీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులలో ప్రజాదర్బార్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. తక్షణ పరిష్కారాల కోసం చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజలతో నేరుగా మమేకమవుతున్న జగన్
వైఎస్ జగన్ తన పర్యటనలో భాగంగా పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. వైఎస్ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డితో కలిసి ప్రజల వినతులు స్వీకరించి, వారికి తగిన పరిష్కారాలను చూపిస్తున్నారు.
కాగా, ఈ ప్రజాదర్బార్లో ఫిర్యాదుదారులు తమ కష్టాలను జగన్కు నేరుగా చెప్పుకుంటున్నారు. కూటమి సర్కార్తో తాము పడుతున్న ఇబ్బందుల గురించి ఎక్కువగా జగన్కు మొరపెట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పులివెందులతో సహా రాయలసీమ జిల్లాల్లోని పలు గ్రామాల్లో కూటమి పార్టీల నేతలు దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లుగా జగన్కు వివరిస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.
ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. జగన్ ప్రజలతో కలిసిమెలిసి మమేకమవుతున్న తీరు ప్రజలలో మరింత విశ్వాసాన్ని నింపుతోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.