ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ (YS Jagan)పై గుంటూరు జిల్లా నల్లపాడు (Nallapadu) పోలీస్ స్టేషన్లో మరో కేసు (Case) నమోదైంది. ఇన్నాళ్లూ కార్యకర్తలు, సీనియర్ లీడర్లకు పరిమితమైన కేసులు.. ఇప్పుడు వైసీపీ అధినేత వరకు చేరుకున్నాయి. ఫిబ్రవరి 19న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ, జగన్ గుంటూరులోని మిర్చి యార్డును అనుమతి లేకుండా సందర్శించారని ఆరోపణలు నేపథ్యంలో మాజీ సీఎంతో పాటు వైసీపీ నాయకులైన అంబటి రాంబాబు (Ambati Rambabu), లేళ్ల అప్పిరెడ్డి (Lella Appi Reddy), మోదుగుల వేణుగోపాల్ రెడ్డి (Modugula Venugopala Reddy), కావటి మనోహర్ నాయుడు (Kavati Manohar Naidu)లపై కూడా కేసు నమోదైంది.
నల్లపాడు పోలీసులు వీరికి సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేసినట్లుగా సమాచారం. అయితే తాము పిలిచినప్పుడు విచారణకు రావాలని నోటీసుల్లో సూచించినట్లుగా తెలుస్తోంది. అనుమతి లేకుండా మిర్చి యార్డులో ప్రవేశించి, రైతులతో సమావేశమై, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (Model Code of Conduct) ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా సమాచారం. కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై అక్రమ కేసులు దాఖలు చేస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
కాగా, ఇటీవల రెంటపాళ్ల పర్యటనపై కూడా మాజీ సీఎం వైఎస్ జగన్పై పోలీస్ కేసు నమోదు కాగా, ఫిబ్రవరిలో జరిగిన పర్యటనకు సంబంధించి తాజాగా మరో కేసు నమోదవ్వడంతో పోలీసుల తీరు పలు అనుమానాలకు తావిస్తోందంటున్నారు వైసీపీ నేతలు.