లండన్ పర్యటన అనంతరం బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇవాళ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి శాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేశ్, విడదల రజిని సహా అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలంతా హాజరయ్యారు.
ఈ సమావేశంలో టీడీపీ కూటమి ప్రభుత్వ విధానాలు, ప్రజావ్యతిరేక నిర్ణయాలు, పార్టీ భవిష్యత్తు కార్యచరణపై నేతలతో జగన్ విస్తృతంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. జగన్ పార్లమెంట్ నియోజకవర్గాల పర్యటన కూడా చర్చించినట్లుగా సమాచారం. తిరుపతిలో టీడీపీ, జనసేన నేతల దాడులు, అప్రజాస్వామికంగా గెలిచిన విధానాన్ని కూడా పార్టీ నేతలు జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది.