వైసీపీ ప్రభుత్వంపై వదంతులు, అపోహలు సృష్టించేలా నిత్యం అసత్యాలను ప్రచారం చేయడం ద్వారానే కూటమి అధికారంలోకి వచ్చిందని వైసీపీ సీనియర్ నేత కనుమూరి రవిచంద్రారెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్, చంద్రబాబు మీడియా అండతో ప్రతీ విషయంలోనూ వైసీపీపై అసత్య ప్రచారాలు చేసి, ప్రజలను తప్పుదోవపట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవన్నీ అసత్యాలని తేలిందని వారికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, తమ పార్టీకి, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇప్పటం కేసు.. పవన్ రాజకీయం
తాడేపల్లి మండల పరిధిలోని ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాన్ని రాజకీయాల్లోకి లాగి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. 2022లో రోడ్డు విస్తరణకు ముందుగా నోటీసులు ఇచ్చినా, గ్రామస్థుల నిర్లక్ష్యంతో నిర్మాణాలు తొలగించాల్సి వచ్చిందని తెలిపారు. కానీ, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయోజనాల కోసం దీనిని తప్పుగా చూపించి, తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. హైకోర్టు, అనంతరం సుప్రీంకోర్టు కూడా రైతుల పిటిషన్ను కొట్టి పారేసి, నోటీసులు చట్టబద్ధమైనవేనని స్పష్టత ఇచ్చినప్పటికీ, పవన్ కళ్యాణ్ ఇప్పటికీ క్షమాపణ చెప్పడం లేదన్నారు.
డ్రగ్స్ ఆరోపణలు.. చంద్రబాబు ప్రచారం
విశాఖ తీరంలో డ్రగ్స్ షిప్ వచ్చినట్లు చేసిన ఆరోపణలను సీబీఐ ఖండించిన తర్వాత కూడా, చంద్రబాబు తన తప్పుడు ఆరోపణలకు క్షమాపణ చెప్పకపోవడం దారుణమని రవిచంద్రారెడ్డి అన్నారు. 25,000 కిలోల డ్రగ్స్ ఆరోపణలను సీబీఐ నిరాధారమని తేల్చిందని చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థల నివేదికల తరువాత కూడా చంద్రబాబు మౌనం దారుణమన్నారు.
అబద్ధాల పునాదిపై టీడీపీ రాజకీయాలు
అబద్ధాల పునాదులపై చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిందని, చంద్రబాబుకు నిజం చెప్పే అలవాటు లేదని రవిచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు అబద్ధాలపై తాము ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తామన్నారు. తాజాగా సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి, ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చారన్నారు. ఈ ఆరు నెలల్లో ఆ హామీలను విస్మరించడంతో ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని చెప్పారు. కూటమి ప్రభుత్వ అబద్ధాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటామని, ప్రజలకు నిజాలు తెలియజేయడమే తమ బాధ్యత అని వైసీపీ నేత రవిచంద్రారెడ్డి అన్నారు.