వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Amendment Bill) ను పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) ఈ బిల్లును రేపు (బుధవారం) లోక్సభ (Lok Sabha)లో ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 12:15 గంటలకు ఈ బిల్లుపై లోక్సభలో చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో, బీజేపీ (BJP) అధిష్టానం తమ ఎంపీలందరికీ రేపటి ప్రత్యేక సమావేశానికి హాజరుకావాలంటూ విప్ జారీ చేసింది. అయితే, ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
ఈ బిల్లుపై మొత్తం 8 గంటల పాటు చర్చ సాగనుంది. ఎన్డీఏ (NDA)కు చెందిన 298 మంది ఎంపీలు బిల్లుకు మద్దతు పలికే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలంతా సభకు తప్పకుండా హాజరుకావాలని పార్టీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ (Congress Party) కూడా ఎంపీలకు విప్ జారీ చేసింది. సభకు కచ్చితంగా సభ్యులంతా హాజరు కావాలని కోరింది.