మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వివేకా పీఏ కృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, ఏఎస్పీ రాంసింగ్ వారికి అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వమని గతంలో తనన్ను ఇబ్బంది పెట్టారని సంచలన విషయాలను వెల్లడించారు. అప్పట్లో వారి బెదిరింపులపై పోలీసు స్టేషన్లో ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. దీంతో పులివెందుల కోర్టులో ప్రైవేటు కేసు వేశానని, కోర్టు ఆదేశాల మేరకు ఆనాడు కేసు కట్టారని వివరించారు.
తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చాక కేసును తిరగతోడి తనను ఇంటికి వచ్చి విచారించారన్నారు. గతంలో తాను చెప్పినదే మరోసారి పోలీసులకు వివరించానని, కానీ పోలీసులు స్టేట్మెంట్ ఎలా రాసుకున్నారో తనకు తెలియదని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో తన స్టేట్మెంట్ రికార్డ్ ఇవ్వమని ఇప్పటికే 10 సార్లు డీఎస్పీని కోరినా స్పందించడం లేదన్నారు. నిన్న కోర్టులో తనది తప్పుడు కేసని పిటిషన్ వేశారని తెలిసిందన్నారు. దీంతో ఈ రోజు కూడా తాను స్టేట్మెంట్ కాపీ కోసం డీఎస్పీ ఆఫీసుకు వచ్చానన్నారు. ఈ రోజు కూడా డీఎస్పీ అందుబాటులో లేరన్నారు.
తన స్టేట్మెంట్ తన చేతికి ఇస్తే వారు ఫాల్స్ కేసు అంటున్న అంశంపై స్పష్టత ఇస్తానని వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వివేకా కూతురు సునీత ఏం ప్రభావితం చేసిందో తెలియదు కానీ, కేసును మళ్లీ విచారించారని, అప్పటికి, ఇప్పటికీ తన స్టేట్మెంటులో ఎటువంటి మార్పు లేదని కృష్ణారెడ్డి తెలిపారు. కానీ, పోలీసులు దీన్ని ఫాల్స్ కేసు అని ఎలా చెప్పారో తేలాల్సి ఉందన్నారు. అందుకే తన స్టేట్మెంట్ ఎలా రికార్డ్ చేశారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నానని, పోలీసులు మాత్రం ఇప్పటి వరకూ తన స్టేట్మెంట్ ఇవ్వడం లేదన్నారు.