విశాఖపట్నం పీఎంపాలెం వద్ద ఉన్న ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి (YSR) పేరును తొలగించారు. గతంలో 2009లో, వైఎస్సార్ రాష్ట్రానికి అందించిన సేవలకు గుర్తుగా స్టేడియానికి ఆయన పేరు పెట్టారు. అయితే, తాజాగా అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ పేరు తొలగించింది.
దీంతో విశాఖలో వైఎస్సార్ గుర్తులను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న విమర్శలు తీవ్రమయ్యాయి. బీచ్ ప్రాంతంలోని వైఎస్సార్ వ్యూ పాయింట్లు ధ్వంసం చేయడం, ఇప్పుడు క్రికెట్ స్టేడియం పేరును మార్పు చేయడం విమర్శలకు తావిస్తోంది.
వైఎస్సార్ అనుచరుల ఆగ్రహం
ఈ చర్యపై క్రికెట్ అభిమానులు, వైఎస్సార్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో మార్పులు చేయాల్సిన అవసరం ఉంటే, ప్రభుత్వం తన పనితీరుతో నిరూపించుకోవాలిగానీ, ఇలాంటి చారిత్రిక గుర్తులను తొలగించడం దారుణం ఏంటని మండిపడుతున్నారు. మార్పు వెనుక రాజకీయ కుట్ర దాగివుందనీ, గతంలో విజయవాడలో కూడా వైఎస్ఆర్ విగ్రహాన్ని కావాలని కుట్రతోనే చంద్రబాబు తొలగించారని వైసీపీ అభిమానులు, వైఎస్ఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి