SLBC టన్నెల్ ప్రమాదం సహాయక చర్యల్లో కొత్త అవరోధాలు ఎదురవుతున్నాయని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు. దీంతో టన్నెల్లో చిక్కుకున్నవారిని ప్రాణాలతో బయటకు తీసుకురావడం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. టన్నెల్ బోరింగ్ మిషన్ పూర్తిగా ధ్వంసమవ్వడం సహాయక చర్యలకు ఆటంకంగా మారింది.
ప్రధాన సమస్యలు
టన్నెల్లో 500 మీటర్ల మేర శిథిలాలు, మట్టి, సిమెంట్ రింగులతో టన్నెల్ పూర్తిగా మూసుకుపోయింది. ప్రమాదం జరిగిన ప్రాంతం టన్నెల్లో చాలా లోపల ఉంది. రైల్వే ట్రాక్ 2 కిలోమీటర్ల మేర నీటిలో మునిగిపోయింది. విద్యుత్ సరఫరా నిలిపివేతతో టన్నెల్లో లోపల సహాయక బృందాలు ప్రవేశించడానికి తీవ్ర ఆటంకంగా మారింది.
మహా సంక్లిష్టం సహాయక చర్యలు
శిథిలాలను తొలగించడానికి రైల్వే ట్రాక్ను ఉపయోగించే ప్రణాళిక ఉన్నప్పటికీ, భారీ యంత్రాలను లోపలికి తీసుకెళ్లడం ప్రస్తుతం సాధ్యం కాకపోతోంది. బోరింగ్ మిషన్ శిథిలాలు పూర్తిగా పడిపోవడం వల్ల దాన్ని తొలగించకపోతే సహాయక చర్యలు ముందుకు సాగే అవకాశం కనిపించడం లేదు. శిథిలాలను తొలగించడానికి కనీసం నెలరోజుల సమయం అవసరం అని NDRF అధికారులు స్పష్టం చేశారు. సహాయక బృందాలు ప్రస్తుతానికి శిథిలాలను తొలగించే ప్రక్రియలో నిమగ్నమై ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో టన్నెల్లో ప్రాణాలతో ఎవరు ఉన్నారనే ఆశలు సన్నగిల్లుతున్నాయి. పూర్తి సహాయక చర్యలకు నెల రోజుల సమయం అవసరమవుతుందని అధికారులు చెబుతున్నారు.