తెలంగాణ హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక తీర్పు వెలువరించింది. సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మరియు ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
పిటిషన్, వాదనలు
గత ఏడాది (2024) ఫిబ్రవరి 1వ తేదీతో సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో, నల్గొండకు చెందిన సర్పంచ్లు ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విచారణలో పిటిషనర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం తమ వాదనలను వినిపించాయి. ఎన్ని రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తారో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. ప్రక్రియ పూర్తికి 25 రోజుల సమయం కావాలని ప్రభుత్వం కోర్టుకు తెలుపగా, ఎన్నికల నిర్వహణకు 60 రోజుల సమయం కావాలని ఎన్నికల కమిషన్ కోరింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, హైకోర్టు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని తీర్పునిచ్చింది. ఈ ఆదేశాలతో రిజర్వేషన్లు, వార్డు డివిజన్ ప్రక్రియ మొదలు కానుంది.
రిజర్వేషన్ల అమలుపై కసరత్తు
హైకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా, బీసీలకు ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై కసరత్తు చేస్తోంది. అయితే, రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదన్న సుప్రీంకోర్టు నిబంధనతో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఒకవేళ 42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టపరమైన గ్రీన్ సిగ్నల్ రాకపోతే, కాంగ్రెస్ పార్టీ పరంగా రిజర్వేషన్లు చేసి, 42 శాతం మంది బీసీలకు టికెట్లు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మీనాక్షితో పాటు అధిష్టానంతో పలు దఫాలుగా చర్చలు కూడా జరిగాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో రిజర్వేషన్లపై విధానం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.