వైసీపీ (YSRCP) నేత, దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి (Y.S. Vivekananda Reddy) హత్య కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు (Supreme Court of India) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు (Further Investigation) కొనసాగించడాన్ని వ్యతిరేకిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సునీత రెడ్డి (Sunita Reddy) దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో సునీత తరఫున చంద్రబాబు సర్కారు తరఫున కేసులు వాదించే న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హాజరయ్యారు.
జస్టిస్ సుందరేశ్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. ఈ సందర్భంగా కేసు దర్యాప్తు సాగుతున్న తీరుపై సీబీఐ(CBI) వైఖరిని స్పష్టంగా తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
“ఇంకెంతకాలం ఈ కేసులో దర్యాప్తు కొనసాగించాలనుకుంటున్నారు? మళ్లీ మినీ ట్రయల్ కొనసాగించాలనే ఉద్దేశమా? ఇలాగే సాగితే దర్యాప్తు పూర్తవడానికి మరో పదేళ్లు పడుతుంది” అంటూ సీబీఐ తీరుపై ప్రశ్నల వర్షం కురిపించింది.ఈ కేసును లాజికల్ ఎండ్కు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. “తదుపరి దర్యాప్తు అవసరం లేదని భావిస్తే కేసును క్లోజ్ చేయాలి. లేదంటే, ఎంతవరకు తదుపరి దర్యాప్తు అవసరమో స్పష్టంగా చెప్పాలి” అని ధర్మాసనం పేర్కొంది.
అలాగే, తదుపరి దర్యాప్తుకు అనుమతి ఇస్తే, దాని ప్రభావం నిందితుల బెయిల్పై ఎలా ఉంటుందన్న అంశాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. అన్ని అంశాలను సమతుల్యం చేస్తూ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
సీబీఐ తరఫున హాజరైన న్యాయవాది తమ వైఖరి తెలియజేయడానికి కొంత సమయం కావాలని కోరగా, సుప్రీంకోర్టు ఆ అభ్యర్థనను మన్నించి తదుపరి విచారణను ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది. సీబీఐ సమర్పించే వైఖరి ఆధారంగానే ఈ కేసులో తగిన నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో, ఈ విచారణకు ప్రాధాన్యత మరింత పెరిగింది.








ఆది ‘కమ్మగా’ వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు – ఏపీ బీజేపీ చీఫ్