తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టులో కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న అడిషినల్ ఎస్పీ మేకల తిరుపతన్న గత ఏడాది అక్టోబరులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విచారణలో రాష్ట్ర ప్రభుత్వ తరఫున సిద్ధార్థ్ లూథ్రా, తిరుపతన్న తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు విచారణ మధ్యలో కీలక వ్యాఖ్యలు చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న పాత్రపై దర్యాప్తు ఎప్పటి వరకు కొనసాగుతుంది అంటూ కోర్టు ప్రశ్నించింది. విచారణలో అనవసరంగా సమయం తీసుకోవడం సరికాదని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తును అడ్డుకోవాలని కోర్టు అనుకుంటున్నట్లు లేదని చెప్పింది, కానీ దర్యాప్తులో మరింత స్పష్టత కావాలని సూచించింది. తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా వేసింది.