గత చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వ హయాంలో జరిగిన పదో తరగతి (Tenth Class) విద్యార్థి సుగాలి ప్రీతి (Sugali Preeti) మరణం.. రాష్ట్రంలో మరోసారి రాజకీయ వేడిని రగిలిస్తోంది. టీడీపీ(TDP) హయాంలో జరిగిన కేసును వైసీపీ(YSRCP) ప్రభుత్వం సీబీఐ(CBI)కి అప్పగించి, ప్రీతి కుటుంబానికి 5 ఎకరాల పొలం, కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలంతో పాటు సుగాలి ప్రీతి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం (Government Job) కల్పించారు. అయితే ఎన్నికల సమయంలో సుగాలి ప్రీతి అంశాన్ని భుజానికి ఎత్తుకున్న పవన్.. అధికారంలోకి వచ్చి 14 నెలలు అయినా న్యాయం చేయలేదంటూ సుగాలి ప్రీతి తల్లి ఆందోళనకు దిగారు. ఎనిమిదేళ్లయినా తన కుమార్తె చావుకు న్యాయం దక్కలేదంటూ మృతురాలి తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం తమ వల్లే సుగాలి ప్రీతి కేసు హైలైట్ అయ్యిందని, ఆ కుటుంబానికి న్యాయం జరిగిందని చెప్పుకుంటుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అసలు సుగాలి ప్రీతి కేసులో వాస్తవాలను పరిశీలిద్దాం..

కర్నూలు శివారులోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి 2017 ఆగస్టు 19 తేదీన అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. సుగాలి ప్రీతి మరణానికి కొద్దిరోజుల ముందు తన తల్లిదండ్రులకు పాఠశాల కరస్పాండెంట్ వల్లపురెడ్డి జనార్దన్ రెడ్డి కుమారులు హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి రాత్రి సమయంలో హాస్టల్లో తమను వేధిస్తున్నారని చెప్పనట్లుగా తల్లిదండ్రులు వెల్లడించారు. తన కుమార్తె మృతదేహంపై చేతులు, కాళ్లపై గాయాలున్నాయన, ఇది సహజ మరణం కాదని, ప్రీతిని లైంగికంగా దాడి చేసి హత్యచేసి ఆత్మహత్యగా నాటకమాడారు ప్రీతి తల్లి ఆరోపించింది. తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని, స్కూల్ యజమాని కొడుకులు లైంగిక దాడి చేసి చంపేశారని ప్రీతి తల్లిదండ్రులు సుగాలి పార్వతిదేవి, రాజు నాయక్ న్యాయపోరాటానికి దిగారు.

కొద్దిరోజులకే నిందితులకు బెయిల్..
సుగాలి ప్రీతి అంశం రాష్ట్ర వ్యాప్తంగా వేడెక్కడంతో స్కూల్ కరస్పాండెంట్, ఆయన కుమారులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్ది రోజులకే వారు బెయిల్పై బయటకు వచ్చేశారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం సుగాలి ప్రీతి కేసును నామమాత్రంగా విచారణ జరిపించిందనే ఆరోపణలొచ్చాయి. పదో తరగతి బాలిక మృతికి న్యాయం చేయలేని గత టీడీపీ సర్కార్పై ప్రజలంతా మండిపడ్డారు. 2017 నుంచి 2019 వరకు అంటే అధికారం నుంచి దిగిపోయే నాటికి ఆ కుటుంబానికి బాసటగా నిలవలేకపోయింది.
పోస్టుమార్టం రిపోర్ట్ ఏం చెబుతోంది..?
కాగా, సుగాలి ప్రీతి పోస్ట్మార్టం రిపోర్ట్లో మరణానికి ముందుగా ఆమెపై లైంగిక దాడి జరిగిందని, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఫోరెన్సిక్ డాక్టర్ శంకర్ నిర్ధారించారు. డా. శంకర్ బాధితురాలి కులానికి సంబంధించిన వ్యక్తి కనుక అతని నివేదిక పక్షపాతంగా ఉండొచ్చని ఈ కేసు విచారించిన డీఎస్పీ విజయ్ కుమార్ అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో ముగ్గురు డాక్టర్లతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. వారు ఎటువంటి పరిశీలనలు చేయకుండానే ఫోటోలు, పాత రికార్డుల ఆధారంగా ఒక అంచనాకు వచ్చారు. బాధితురాలి వెంట్రుకలు, గోళ్ల నమూనాలు వంటి డేటా సైతం సరిగా భద్రపరచబడలేదు అని ఆ కమిటీనే పేర్కొంది. ఈ పరిస్థితిని ఆ కమిటీ “లైంగిక దాడి నిరూపణకు తగిన ఆధారాలు అందుబాటులో లేవు” అని ముగించింది.

ఫుల్ ఫిల్ అవ్వని పవన్ ప్రామీస్..
2017లో జరిగిన సుగాలి ప్రీతి కేసును ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వానికి అంటగడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. బహిరంగ సభల్లో సుగాలి ప్రీతి కేసును పలు సందర్భాల్లో ప్రస్తావించారు. ప్రీతి తల్లిదండ్రులు సైతం పలుమార్లు పవన్ను కలిసి కన్నీరు పెట్టుకున్నారు. అయితే అధికారంలోకి రాగానే వారికి తప్పకుండా న్యాయం చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రామీస్ సైతం చేశారు. పబ్లిక్ మీటింగ్స్లోకి ప్రీతి తల్లిదండ్రులను తీసుకువచ్చి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ న్యాయం చేస్తానని మాటిచ్చారు. కానీ, కూటమిలో నేడు పవన్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న 14 నెలల పదవీ కాలం పూర్తి చేసుకున్నా.. తమ కుమార్తెకు న్యాయం జరగలేదని సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతిదేవి మళ్లీ ఆందోళనకు దిగారు.

సీబీఐకి అప్పగించిన వైసీపీ ప్రభుత్వం..
2019లో ప్రభుత్వం మారినా సుగాలి ప్రీతి కేసుపై ఆందోళనకు ఆగలేదు. పాదయాత్రలో ప్రీతి తల్లిదండ్రులకు ఇచ్చిన మాట ప్రకారం.. సుగాలి ప్రీతి కేసులో అనేక అనుమానాలను వ్యక్తమవుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులకు న్యాయం చేయాలని అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చారు. అదేవిధంగా 2021లో ప్రీతి తల్లిదండ్రులకు రూ. 8 లక్షల నగదుసాయంతో పాటు 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల పొలాన్ని కూడా జగన్ ప్రభుత్వం ఇచ్చింది. ప్రీతి తండ్రి రాజు నాయక్కు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చింది. కాలం గడిచిపోయింది.. ఎన్నికలొచ్చాయి, మళ్లీ ప్రభుత్వం మారిపోయింది.

చేతులెత్తేసిన సీబీఐ
2024 ఎన్నికల్లో నెగ్గి కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. మెల్లగా సుగాలి ప్రీతి కేసును సీబీఐ అధికారులు పక్కకు పడేశారు. వనరులు కొరత కారణంగా తాము ప్రీతి కేసును దర్యాప్తు చేయలేమని హైకోర్టుకు సీబీఐ నివేదించింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు పలు ముఖ్యమైన, సున్నిత కేసుల్లో దర్యాప్తులు కొనసాగిస్తున్నామని కోర్టుకు తెలిపారు. కాబట్టి సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగిస్తూ వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన ఉత్తర్వులపై ప్రీతి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేయాలని హైకోర్టును సీబీఐ కోరింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడవక ముందే సీబీఐ చేతులెత్తేయడంతో సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మళ్లీ ఆందోళనకు దిగిన ప్రీతి తల్లి
ప్రభుత్వంలోకి రాగానే తొలి సంతకం తన కూతురు ఫైల్ మీదే అని పవన్ కళ్యాణ్ మాటిచ్చి 14 నెలలు అయినా కేసు కొలిక్కి రాకపోవడంతో సుగాలి ప్రీతి తల్లి ఆవేదనతో మళ్లీ మీడియా ముందుకు వచ్చి కన్నీరుపెట్టుకుంది. పవన్ కళ్యాణ్ తీరుకు నిరసనగా దివ్యాంగురాలైన తాను వీల్చైర్లోనే పాదయాత్ర మొదలుపెడతానని హెచ్చరించడంతో సుగాలి ప్రీతి కేసులో మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తన కుమార్తె కేసును ఎన్నికల సమయంలో ప్రచారానికి వాడుకొని వదిలేశారని ప్రీతి తల్లి పార్వతిదేవి పవన్ కళ్యాణ్పై మండిపడగా, జనసేన ఎమ్మెల్యేలు మాత్రం మృతురాలి తల్లి మాటలను పచ్చిఅబద్ధమంటూ కొట్టిపారేస్తున్నారు.
వైసీపీ ఇచ్చింది తమవల్లేనన్న ఎమ్మెల్యేలు
సుగాలి ప్రీతి కుటుంబానికి 5 ఎకరాల పొలం, ఆర్థికసాయం, ఇంటి స్థలం, ప్రీతి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది పవన్ కళ్యాణే అని జనసేన పార్టీ ఎమ్మెల్యేలు మీడియా ముందు చెప్పడం వివాదాస్పదంగా మారింది. నాడు పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు రూ.8 లక్షల సాయం, 5 ఎకరాల పొలం, 5 సెంట్ల స్థలం, ప్రభుత్వ ఉద్యోగం వైసీపీ ప్రభుత్వం ఇవ్వగా, దాన్ని కూడా వారి క్రెడిట్గా భావించడం విడ్డూరమంటున్నారు ఏపీ ప్రజలు. 14 నెలలు అయినా కేసులో ఎలాంటి పురోగతి సాధించకపోగా, గత ప్రభుత్వంలో సుగాలి ప్రీతి కుటుంబాన్ని వైఎస్ జగన్ ఆదుకుంటే.. ఆ మేలును కూడా తమ ఖాతాలో వేసుకోవడంపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు.