పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన అత్యాచార కేసులో మనోజిత్ మిశ్రా అనే క్రిమినల్ లాయర్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. కోల్కతాలోని సౌత్ కలకత్తా లా కాలేజీ ప్రాంగణంలో జూన్ 25న 24 ఏళ్ల న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
కేసు వివరాలు..
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, ఆమెను నిందితులు ముగ్గురూ (మనోజిత్ మిశ్రా, జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖర్జీ) ఓ గదిలోకి లాక్కెళ్లి దాడికి పాల్పడ్డారు. మనోజిత్ మిశ్రా లైంగిక దాడికి పాల్పడగా, మిగిలిన ఇద్దరు సహాయపడినట్లు ఆమె ఆరోపించింది. దాడిని బయటపెడితే వీడియోలు విడుదల చేస్తామని నిందితులు బెదిరించినట్లు బాధితురాలు తెలిపింది. వైద్య పరీక్షల్లో దాడి జరిగినట్లు నిర్ధారణ అయింది.
నిందితుల అరెస్టు..
ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు వేగంగా స్పందించి మనోజిత్ మిశ్రా, జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖర్జీలను అరెస్టు చేశారు. కాలేజీ సెక్యూరిటీ గార్డు పినాకి బెనర్జీని కూడా అరెస్టు చేశారు. నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మనోజిత్ మిశ్రా తృణమూల్ కాంగ్రెస్ ఛాత్ర పరిషత్ (TMCP) మాజీ సభ్యుడిగా ఉండటంతో ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంది. టీఎంసీ నాయకులు ఈ సంఘటనను ఖండించినా, బీజేపీ మాత్రం టీఎంసీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది. మహిళల భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. ఈ కేసు కోల్కతా విద్యాసంస్థల్లో మహిళల భద్రతపై మరోసారి ఆందోళనలను రేకెత్తించింది.