కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ కారణంగా, కర్ణాటకలోని బెళగావిలో గురువారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలకు ఆమె హాజరుకాలేదు. సోనియా గాంధీ ప్రస్తుతం చికిత్స పొందుతున్నందున, ఆమె కుమార్తె ప్రియాంకా గాంధీ ఆమెతో ఉన్నారు.
పాల్గొన్న రాహుల్, ఖర్గే
సీడబ్ల్యూసీ సమావేశాలకు “నవ సత్యాగ్రహ బైఠక్” అనే పేరు పెట్టారు. బెళగావిలో మహాత్మాగాంధీ నగర్లో గురువారం మధ్యాహ్నం సీడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ జెండాను ఎగురవేసి ఈ సమావేశాలను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ఏఐసీసీ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో కలిసి “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీతో పాటు, సీడబ్ల్యూసీ సమావేశంలో 200 మంది కీలక నాయకులు పాల్గొంటారని ఏఐసీసీ ప్రకటించింది.
ఈ సమావేశాల్లో ప్రధానంగా రెండు కీలక తీర్మానాలను ఆమోదించేందుకు, తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. అలాగే, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చ జరగనుంది.