మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్షసాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగయ్య మృతిపై ఆయన భార్య సంచలన ఆరోపణలు చేశారు. పోలీసుల చిత్రహింసల మూలంగానే రంగయ్య చనిపోయారని ఆయన భార్య సుశీలమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి రంగయ్య మృతి చెందారు. కాగా, రంగయ్య మృతిపై తనకు అనుమానాలు ఉన్నాయంటూ సుశీలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
‘‘నా భర్తను 2024 వరకూ పోలీసులు బాగానే చూసుకున్నారు. ఆ తర్వాత చిత్రహింసలకు గురిచేశారు. ఆయన కీళ్లు విరగొట్టారు. పోలీసుల కొట్టి కొట్టి చనిపోయేలా చేశారు. గత మూడు నెలలుగా ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా పట్టించుకోలేదు. ఢిల్లీ నుంచి అన్నీ ప్రాంతాలు తిప్పారు. ఇప్పుడు మాకేం సంబంధం అంటున్నారు. రంగయ్య మృతికి సీబీఐ, పోలీసులే కారణం’’ అని సుశీలమ్మ ఆస్పత్రి ఎదుట మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. సుశీలమ్మ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ ఉసలయ్య తెలిపారు. మృతికి కారణం ఏమిటో పోస్ట్ మార్టం నివేదికలో తెలుస్తుందని సీఐ తెలిపారు.