అధికారంలో ఉండగా వైఎస్ జగన్ చేసిన మంచిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత పార్టీ నేతలపై ఉందని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో తమ ఆలోచనలను సమర్థంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళే పార్టీలకే సానుకూలత ఉంటుందని చెప్పారు. ఆ దిశలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆలోచనలు, ఆచరణను పార్టీ నేతలు ఆత్మవిశ్వాసంతో ప్రజల్లో వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ కేంద్ర మీడియా కమ్యూనికేషన్స్పై వర్క్షాప్ను సజ్జల ప్రారంభించి మాట్లాడారు.
మనవాణి ప్రజల్లోకి తీసుకెళ్లాలి..
భావ వ్యక్తీకరణ ప్రజలపై ప్రభావం చూపుతుందని, దాన్ని పటిష్టంగా వినియోగించుకోగలిగితే వైసీపీ మరింత బలోపేతం అవుతుందన్నారు. వైసీపీ కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో మిసైళ్లలా తమ అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. నాడు జగన్ ప్రభుత్వంలో ఏం చేశాం? అనేది గుర్తుంచుకుని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఏమిటన్న దానిపైన అవగాహన పెంచుకోవాలన్నారు. పార్టీ విధానాలకు అనుగుణంగా వాణిని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలని సూచించారు.
మీడియా ప్రచారం అండతోనే అధికార తెలుగుదేశం పార్టీ నడుస్తోందన్నారు. అబద్ధాలను కూడా వేగంగా ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష ప్రచారాన్ని సమర్థంగా ఎదుర్కోవాలన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మీడియా, సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలకు చేరువవుతూ, ప్రభుత్వ విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు.
ఆ సాధనాన్ని బలంగా వినియోగించుకోవాలి
పార్టీలో కొత్తగా పదవులు స్వీకరించిన వారు, బాధ్యతలు చేపట్టిన వారు ఆయా ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీలు, వివిధ శక్తుల ముందు వాదనను సమర్థంగా వినిపించాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఆత్మవిశ్వాసంతో పార్టీ వాదనను శక్తివంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. సోషల్ మీడియా ప్రజల ఆలోచన ధోరణులు ప్రభావితం చేసే ప్రధాన సాధనంగా మారిందని, బలమైన ఆ ప్రచార సాధన వినియోగంలో పార్టీ నాయకులంతా చురుగ్గా వ్యవహరించాలని కోరారు.