ప్రముఖ కార్పొరేట్ విద్యా సంస్థ శ్రీచైతన్య (Sri Chaitanya) ర్యాగింగ్ (Ragging) భూతం సంచలనంగా మారింది. పదో తరగతి విద్యార్థికి (Student) ఐరన్ బాక్స్ (Iron Box)తో వాతలు పెట్టిన దారుణమైన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని మోరంపూడి శ్రీ చైతన్య (Sri Chaitanya) స్కూల్ హాస్టల్ (School Hostel)లో జరిగింది. కాళ్లు, చేతులు, పొట్ట పైభాగంపై కాలిన గాయాలతో విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. కోనసీమ జిల్లా మలికిపురం మండలం శంకరగుప్తం గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి గుర్రం విన్సెంట్ ప్రసాద్ (Gurram Vincent Prasad) (16) మోరంపూడి (Morampudi)లోని శ్రీచైతన్య స్కూల్లో చదువుతున్నాడు. హాస్టల్లో ఉంటున్న విన్సెంట్ ప్రసాద్పై సహచర విద్యార్థులు అమానుషంగా ప్రవర్తించారు. ఐరన్ బాక్స్తో పొట్ట పైభాగం, చేతులపై విచక్షణా రహితంగా వాతలు పెట్టి పైశాచికత్వం ప్రదర్శించారు.
హాస్టల్లో ఉన్న తన బిడ్డను చూసేందుకు తల్లి లక్ష్మీ కుమారి శ్రీచైతన్య స్కూల్కి వెళ్ళగా, ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఘటన గురించి ఎవరికైనా చెప్పితే చంపేస్తామని బెదిరించడంతో విన్సెంట్ ప్రసాద్ మౌనం వహించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై తల్లి లక్ష్మీకుమారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిపై దారుణానికి పాల్పడిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే యాజమాన్యం మాత్రం ఈ ఘటనపై స్పందించకపోవడం మరింత విమర్శలకు దారి తీస్తోంది.