రాజకీయాలలో మార్పులు, మలుపులు సహజం. గత లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) – కాంగ్రెస్ కలసి పోటీచేసినప్పటికీ, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయం వచ్చేసరికి వారి మార్గాలు పూర్తిగా భిన్నంగా మారాయి. ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు ఇటీవల కేజ్రీవాల్పై తీవ్ర విమర్శలు చేస్తూ, ఆయనను జాతి వ్యతిరేకి, ఫర్జీవల్గా అభివర్ణించారు. లోక్సభ ఎన్నికల్లో కేజ్రీవాల్తో పొత్తు చరిత్రలో ఓ పెద్ద తప్పిదమని అన్నారు.
ప్రియాంక గాంధీ తాజా వ్యాఖ్యలు
ఇటీవల ఢిల్లీలోని చాందినీ చౌక్లోని జామా మసీదులో ప్రియాంక గాంధీ ర్యాలీ నిర్వహించి ప్రధాని మోడీతో పాటు కేజ్రీవాల్పై కూడా నిప్పులు చెరిగారు. “లోక్సభలో కేజ్రీవాల్తో పొత్తు తప్పా?” అనే ప్రశ్నకు సమాధానంగా, “రాజకీయాల్లో తలుపులు మూసి ఉంటాయి, కానీ కిటికీలు తెరిచి ఉంటాయి” అని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో, కాంగ్రెస్ పార్టీ తన సహచర పార్టీలతో కలిసి పార్లమెంటులో ప్రధాన సమస్యలను లేవనెత్తాలని నిర్ణయించింది. ముఖ్యంగా మహా కుంభమేళా నిర్వహణలో లోపాలపై సమాజ్వాదీ పార్టీ పోరుబాట పట్టగా, మొత్తం భారత కూటమి బడ్జెట్ సమావేశ సమయంలో వాకౌట్ చేసింది. మహా కుంభమేళా సందర్భంగా హిందువుల ప్రాణనష్టం జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకమని అఖిలేష్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో, కాంగ్రెస్ ఎంపీ ఉజ్వల్ రామన్ సింగ్ కూడా ప్రతిపక్ష పార్టీలు ఏకమై బలమైన ప్రతిపక్షంగా నిలవాలని పిలుపునిచ్చారు.
అయితే, ఢిల్లీలో AAP, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, మమతా బెనర్జీ తదితరులు కాంగ్రెస్తో దూరంగా ఉంటూ కేజ్రీవాల్కు మద్దతు పలుకుతుండడం భారత కూటమిలో విభేదాలు ఇంకా మిగిలే ఉన్నాయనే సందేహాలను కలిగిస్తోంది. ఇదే సమయంలో, హర్యానా, మహారాష్ట్రలో బలమైన విజయాలు సాధించిన మోడీ ప్రభుత్వం ప్రస్తుతం రాజకీయంగా మరింత ధృడంగా నిలిచింది. పార్లమెంటు లోపల, వెలుపల ప్రధాని మోడీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ ఇచ్చేందుకు కాంగ్రెస్కు మరింత బలమైన వ్యూహం అవసరమని అర్థమైంది.