పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్పై గట్టిగా ప్రభావం చూపింది. మే 7న భారత రక్షణ శాఖ చేపట్టిన ఈ ఆపరేషన్లో భాగంగా చేపట్టిన మెరుపు దాడుల్లో భారత సైన్యం పీవోకే, పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేయడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అర్ధరాత్రి 1.05 గంటల నుంచి 1.30 గంటల మధ్య 25 నిమిషాల వ్యవధిలో భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలపై మిస్సైళ్ల వర్షం కురిపించింది. ఈ దాడిలో 100కు పైగా ఉగ్రవాదాలు హతం అయినట్లుగా సమాచారం.
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో జరిగిన నష్టాన్ని ఎట్టకేలకు పాకిస్తాన్ అంగీకరించింది. సైనికులు మృతిపై పాకిస్తాన్ మొదటిసారిగా అధికారిక ప్రకటన వెల్లడించింది. భారత్ చేపట్టిన ఆపరేషన్లో 11 మంది పాక్ సైనికులు మరణించగా.. మరో 78 మందికి తీవ్ర గాయాలైనట్టు వెల్లడించింది. మృతులలో ఆరుగురు ఆర్మీకి, ఐదుగురు ఎయిర్ఫోర్స్కు చెందినవారని తెలిపింది. వీరిలో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ కూడా ఉన్నట్లు సమాచారం. అదే విధంగా ఆపరేషన్ సిందూర్లో మొత్తం 40 మంది పౌరులు చనిపోగా.. 121 మందికి గాయాలు అయినట్లుగా తెలిపింది. ఈ వివరాలను ఆ దేశ సైన్యానికి చెందిన డీజీ ఐఎస్ పీఆర్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఖండిస్తూ వచ్చిన పాక్, అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ వివరాలు వెల్లడించినట్లు అంచనాలు వేస్తున్నారు. ఈ ఆపరేషన్ ఉగ్రవాద స్థావరాల నిర్మూలనకు దిశగానే సాగిందని భారత రక్షణ వర్గాలు నొక్కి మరీ చెబుతున్నాయి.