పాకిస్తాన్ (Pakistan) ఉగ్రవాదులపై (Terrorists) భారత్ (India) మెరుపుదాడికి దిగింది. 25 నిమిషాల్లో పాకిస్తాన్ను అతలాకుతలం చేసింది. భారత ఆర్మీ పాక్ ఉగ్రమూకల భరతం పట్టింది. మిస్సైళ్లతో మొత్తం తొమ్మిది స్థావరాలపై దాడికి దిగిన భారత త్రివిధ దళాలు.. 100కు పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కాగా, ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన వివరాలను కల్నల్ సోఫియా ఖురేషి (Sophia Qureshi), వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ (Vyomika Singh) ప్రెస్మీట్లో వివరించారు.
ఆపరేషన్ సింధూర్ బుధవారం తెల్లవారుజామున 1:05 మరియు 1:30 గంటల మధ్య జరిగిందని, త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయని చెప్పారు. భారత వైమానిక దాడులు 25 నిమిషాల పాటు విజయవంతంగా కొనసాగాయని, ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయ్యిందని కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వెల్లడించారు.
పహల్గాం మృతులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సింధూర్ ప్రాజెక్టును చేపట్టి విజయవంతంగా పూర్తిచేశామని కల్నల్ సోఫియా ఖురేషి వెల్లడించారు. `గత 30 ఏళ్లలో పాకిస్తాన్ ఉగ్రమూకలకు సౌకర్యాలు కల్పిస్తోంది..శిక్షణ ఇస్తోంది. పాక్ లోని 9 ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశాం. పాకిస్తాన్ లోనూ, పీఓకేలోనూ ఉగ్ర శిబిరాలు ఉన్నాయి. మొత్తం 21 ఉగ్ర స్థావరాలను గుర్తించాం. పాక్ పౌరులకు హాని కలగని రీతిలో దాడులు జరిపాం. ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేశాం. పాక్ సైనిక స్థావరాల జోలికి వెళ్లలేదు అని కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు.
సరిహద్దులోని నియంత్రణ రేఖ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముజఫరాబాద్ (Muzaffarabad) లోని ఎల్ఈటీ (LET – Lashkar-e-Taiba) క్యాంపుపై తొలి దాడి (First Attack) చేశామని భారత రక్షణ శాఖ వివరించింది. ఎల్ఓసీలోని బింబల్ క్యాంపులో దాడి చేశామని, అక్కడే లాష్కరే తోయిబా ఉగ్రవాదులకు ట్రైనింగ్ జరుగుతుందన్నారు. పాకిస్తాన్లోని సర్జల్ క్యాంపుపై దాడి చేశామని, సర్జల్ క్యాంప్ ఎల్ఓసీకి 8 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. ముర్కిదే క్యాంపుపై దాడి చేశామని, అక్కడ నుంచే ముంబై పేలుళ్ల దాడి జరిగిందని, కసబ్ అక్కడే ట్రైనింగ్ తీసుకున్నాడని రక్షణ శాఖ వివరించింది.
పహల్గాం దాడి అత్యంత హేయమైనదని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri) తెలిపారు. ఏప్రిల్ 22న పహల్గామ్ లో భారత పర్యటకులపై ఉగ్రదాడి జరిగిందని, ఈ ఘటనలో 26 మందిని పొట్టనపెట్టుకున్నారని మండిపడ్డారు. పహల్గామ్ ఉగ్రదాడి వెనక లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ (TRF) ఉందని స్పష్టం చేశారు. భారత్లో దాడిచేశామని సోషల్ మీడియాలో టీఆర్ఎఫ్ ప్రకటించిందని గుర్తుచేశారు. టీఆర్ఎఫ్ కు పాకిస్తాన్ అండదండలు ఉన్నాయని చెప్పారు. భారత్ పై ఇక ముందు కూడా దాడులు జరిగే అవకాశం ఉందని, అందుకే పాక్ సరిహద్దు దాటి భారత్ దాడి చేసి గట్టి గుణపాఠం చెప్పిందన్నారు. భారత్ తన అధికారాన్ని ఉపయోగించిందని, ఆపరేషన్ సింధూర్ బాధ్యతాయుతమైన దాడి అని మిస్రీ అన్నారు.