తన సీటును త్యాగం చేసి.. పవన్ను దగ్గరుండి మరీ గెలిపించిన ఎన్వీఎస్ఎన్ వర్మకు అధికారంలోకి భంగపాటు తప్పలేదు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశించిన వర్మకు కూటమి గట్టి షాక్ ఇచ్చింది. సీటు త్యాగం చేసినందుకు మొదటి విడతలోనే ఎమ్మెల్సీగా వర్మకు అవకాశం కల్పించి మండలికి పంపిస్తానని బుజ్జగింపు ప్రక్రియలో మాటిచ్చిన చంద్రబాబు.. ఆ మాట తప్పారు. ఎన్వీఎస్ఎస్ వర్మను తీవ్ర నిరాశలోకి నెట్టారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు తీరుపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అసహనంతో రగలిపోతున్నారు. తన అనుచరుల ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.
నోరు మెదపని పవన్
టీడీపీ విడుదల చేసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల అభ్యర్థుల లిస్ట్లో ఎన్వీఎస్ఎస్ వర్మ పేరు లేదు. కనీసం ఆయన పేరును పరిగణనలోకి తీసుకోలేదన్న సమాచారం వర్మను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. పార్టీ కోసం సీటు త్యాగం చేస్తే తగిన శాస్తి జరిగిందని అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లుగా సమాచారం. పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీటు త్యాగం చేసిన వర్మ.. చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్సీ సీటు దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. దీంతో వర్మ అనుచరులు కూడా టీడీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం నుంచి వర్మ సీటుపై గెలిచిన పవన్ కూడా ఈ విషయంపై నోరుమెదపకపోవడంతో వర్మ అనుచరులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పార్టీ అధిష్టానంపై అసహనంతో ఉన్న వర్మ.. ఏ క్షణమైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అనుచరులు భావిస్తున్నారు.
టీడీపీ అభ్యర్థులు వీరే..
నిన్న రాత్రి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను పార్టీ విడుదల చేసింది. టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బిటి నాయుడులను ఎంపిక చేస్తూ లిస్ట్ విడుదల చేశారు. ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు గానూ, జనసేన నుంచి ఇప్పటికే పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు నామినేషన్ దాఖ చేయగా, పొత్తులో భాగంగా దక్కిన ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేసే పనిలో బీజేపీ బిజీగా ఉంది.