ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ, ప్రభుత్వ పనితీరుపై పలు కీలక సూచనలు చేశారు. తొలిసారి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలకు పరిపాలనలో అవగాహన లేకపోవడం, అనుభవం తక్కువగా ఉండటం వల్ల సమన్వయం లోపిస్తోందని లోకేష్ వ్యాఖ్యానించారు. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలకు సీనియర్ నేతలు మార్గనిర్దేశం చేయాలని సూచించిన నారా లోకేష్ కూడా తొలిసారి ఎమ్మెల్యే కావడం గమనార్హం. కాగా, డిప్యూటీ సీఎం పవన్ కూడా తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేనే.
ఈ మధ్య కేబినెట్ సమావేశానికి హాజరయ్యేందుకు ముందు నారా లోకేష్తో మంత్రులంతా భేటీ అవుతున్నారు. దీంట్లో సీనియర్ మంత్రులు సైతం ఉన్నారు. కేబినెట్లో నారా లోకేష్ కూడా సమచర మంత్రి అయినప్పటికీ, ఎలాంటి ప్రత్యేక హోదా లేకపోయినప్పటికీ ఎందుకు హైప్ క్రియేట్ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
తాజాగా కొత్త ఎమ్మెల్యేలు అనుభవజ్ఞుల నుండి నేర్చుకోవడం చాలా అవసరమని మొదటిసారి ఎమ్మెల్యే అయిన నారా లోకేష్ పాఠాలు చెప్పడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. “సమస్యలు ఎలా ఎదుర్కోవాలో, ఎలా అధిగమించాలో సీనియర్ల అనుభవం కొత్త వారికీ ఉపయోగపడాలి. వరుస విజయాలు సాధించాలంటే లోటుపాట్లు సరిదిద్దుకోవాలి” అని మంగళగిరి నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన లోకేష్ ఎలా చెప్పగలుగుతారు..? ఆ పార్టీలో అపారమైన అనుభవం కలిగిన నాయకుల నుంచి శిక్షణ పొందాలి కానీ, ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే లోకేష్ చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
అదేవిధంగా ప్రతీ మంత్రి తమ శాఖల పరిధిలోని ఒప్పందాలు, కార్యక్రమాల పట్ల పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని లోకేష్ ఆదేశించడం, రేపు జరగనున్న ఎంఎస్ఎంఈ పార్కుల కార్యక్రమంలో అన్ని మంత్రులు విధిగా పాల్గొనాలని ఆదేశించడం వెనుక పెద్ద మతలబే ఉందంటున్నారు.








