వైసీపీ (YSRCP) మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పల్నాడు (Palnadu) జిల్లాలో జరిగిన జంట హత్యల కేసులో టీడీపీ (TDP) వర్గాల మధ్యే ఆధిపత్య పోరాటం కారణమని ఎస్పీ స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఈ కేసులో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy), అతని సోదరుడికి అంటగట్టి వారిపై కేసులు పెట్టడం రాజకీయ కుట్రగా అభివర్ణించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు (Chandrababu), లోకేశ్ (Lokesh)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జంట హత్యలకు వైసీపీకి సంబంధమే లేదని స్పష్టం చేసిన పేర్నినాని.. టీడీపీ జెండా పట్టినవారే ఇందులో పాత్రధారులని చెప్పారు. కొత్త కారు కొన్న ముద్దాయి కారును టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి (Julakanti Brahmareddy) ప్రారంభించడమే కాక, అదే కారులో చంద్రబాబును కలిసారని, అలాంటి వ్యక్తిని వైసీపీకి చెందినవాడిగా ఎలా చెబుతారు అని ప్రశ్నించారు.
బాబుకు వెన్నుపోటు ఖాయం
కాంగ్రెస్ పార్టీ (Congress Party) నుంచి ఎన్టీఆర్ (NTR) కాళ్ల దగ్గరకి చేరి టీడీపీని చంద్రబాబు లాక్కున్నారని, ఆ లక్షణాలనే పుణికి పుచ్చుకున్న నారా లోకేష్ ఇప్పుడు చంద్రబాబుని పార్టీ అధ్యక్ష పీఠం నుంచి లాగబోతున్నాడని పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునే వెన్నుపోటు పొడిచి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కుర్చీ నుంచి లాగి పడేస్తాడని, ఇందతా పైనుంచి చూసి ఎన్టీఆర్ సంబరపడతారన్నారు. రాజకీయాల కోసం ప్రత్యర్థుల కుటుంబ సభ్యులపై నీచ వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని పేర్ని సూచించారు.
లోకేశ్ మేనత్తలు ఎక్కడ..?
హైదరాబాద్ (Hyderabad), అమరావతి (Amaravati), కుప్పం (Kuppam)లలో వందల వేల కోట్లతో చంద్రబాబు విలాసవంతమైన రాజభవనాలు కడుతున్నాడు. కానీ ఏ ఒక్క ప్రారంభోత్సవానికి కూడా చంద్రబాబు తన తోబుట్టువులను ఎందుకు పిలవలేదు? అని పేర్ని నాని ప్రశ్నించారు. ఆయా ఇళ్ల భూమి పూజలు, గృహ ప్రవేశాలకు పాలు పొంగించడానికి తోబుట్టువులు ఎందుకు రాలేదు? తమ్ముడి భార్యను ఎందుకు పిలవలేదు.. వారంతా ఎక్కడున్నారని మేం కూడా అడిగితే ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
ఎన్టీఆర్ పేరెందుకు.. ఖర్జూరపు నాయుడి పేరు చెప్పవా..?
మహానాడు సాక్షిగా నారా లోకేష్ ఎన్టీఆర్ మనవడిని, రాజకీయ వారసుడిని అని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడని, తెలుగు సంప్రదాయంలో మన తాతగారు ఎవరు అవుతారు? అని పేర్ని నాని ప్రశ్నించారు. నాన్న తండ్రి తాతగారు అవుతారని, ఈ లెక్కన లోకేష్ తాతగారు ఎవరంటే అది ఖర్జూరపు నాయుడని, ఆయన పేరు లోకేశ్ ఎందుకు చెప్పుకోవడం లేదని ప్రశ్నించారు. ఆయన ఫొటోకు దండేసి, పూలు జల్లితే తప్పేముందన్నారు. రెండెకరాల సామాన్యుడని ఆయనపై చిన్నచూపా? నారా లోకేష్ ఈ సమాజానాకి ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారో స్పష్టం చేయాలన్నారు.