తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతూ గూండాగిరికి పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కిడ్నాప్లు, భౌతిక దాడులు, దొంగ ఓట్ల నమోదు వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలపై జరిగిన దాడులు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతలా దిగజారిపోయాయో చూపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేక అక్రమ మార్గాలను ఆశ్రయించడం దుర్మార్గ రాజకీయాలకు నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు.
అలాగే ఎమ్మెల్సీలు, ఎంపీల ఎక్స్అఫీషియో ఓట్ల పేరుతో చైర్మన్ పదవులను దక్కించుకునే కుట్రలు జరుగుతున్నాయని, ఇది పూర్తిగా అప్రజాస్వామిక చర్య అని పేర్కొన్నారు. కొందరు పోలీస్ అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులకు అనుకూలంగా చైర్పర్సన్ల ఎన్నికలను వాయిదా వేయడం వెనుక ఉద్దేశపూర్వక రాజకీయ ప్రయోజనాలున్నాయని ఆయన అన్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల కమీషన్ తక్షణమే స్పందించి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారం శాశ్వతం కాదని, బీఆర్ఎస్ నాయకత్వంపై జరుగుతున్న దాడులకు తెలంగాణ ప్రజలే తగిన సమాధానం ఇస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు.








