కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీ ఘటన తర్వాత ఇప్పుడు అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయా? అంటూ ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదిక X (ట్విట్టర్)లో స్పందించిన ఆయన, నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టి బ్యారేజీ కిందే భారీ ఎక్సవేటర్లతో ఇసుక తవ్వకాలు జరపడం దుర్మార్గమే కాకుండా అతిపెద్ద నేరమని మండిపడ్డారు. బ్యారేజీల సమీపంలో ఇసుక తవ్వకాలు నిషేధం అన్న రూల్స్ను ఉల్లంఘించిన ఇసుక మాఫియాపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. “ఏకంగా బ్యారేజీని బలహీనపరిచి బీఆర్ఎస్ పై బురదజల్లే పన్నాగాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలి.
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసేందుకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ చేస్తున్న అరాచకపర్వాన్ని అన్నదాతలు క్షమించే ప్రసక్తే లేదు. నిబంధనలు తుంగలో తొక్కి అన్నారం బ్యారేజి పిల్లర్ల వద్ద ఇసుక తవ్వకాలు చేసి బ్యారేజీని ప్రమాదంలోకి నెడుతుంది రేవంత్ సర్కార్.. ఇది ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే కుట్రే.
పట్టపగలే, నిస్సిగ్గుగా అన్నారం బ్యారేజ్ నుండి కాంగ్రెస్ నాయకుల ఇసుక మాఫియా ఇసుకను తోడేస్తుంది. తెలంగాణ వనరులను కాంగ్రెస్ పార్టీ ఎలా కొల్లగొడుతుందో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. కాళేశ్వరం బ్యారేజీలకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదే. అందినకాడికి దోచుకో.. దొరికినకాడికి అమ్ముకో.. ఇవే తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రజా పాలన సూత్రాలు. తెలంగాణను నిలువు దోపిడి చేస్తున్న కాంగ్రెస్ నాయకులారా.. ప్రజలు మీ భరతం పట్టే రోజు అతి దగ్గరలోనే ఉంది.. ఖబడ్దార్.” అంటూ ట్వీట్ చేశారు.








